అమరావతిలో 13 సంస్థలకు షాక్- కేబినెట్ సబ్ కమిటీ సంచలనం..!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయినా ఇంకా అమరావతిలో నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంపై విమర్శలు వస్తున్న వేళ సచివాలయంలో భూకేటాయింపులపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో గతంలో ఇక్కడ భూములు తీసుకున్న 13 సంస్థలకు షాకిచ్చింది.
రాజధానిలో గతంలో భూములు తీసుకున్న 13 సంస్థలకు వాటి కేటాయింపులు రద్దు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది..వివిధ కారణాలతో ఈ కేటాయింపుల రద్దుకు సబ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. అమరావతిలో సంస్థలకు భూముల కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సుదీర్ఘంగా చర్చించింది. 2014-19 మధ్య కాలంలో అమరావతిలో భూములు కేటాయించిన సంస్థల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఈ సంస్ధలకు భూముల కేటాయంపులు రద్దయాయి.

అమరావతిలో గతంలో 131 సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. వీటిలో 31 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపులు కొనసాగించాలని నిర్ణయించామన్నారు. మరో రెండు సంస్థలకు గతంలో ఇచ్చిన చోట కాకుండా వేరొక చోట కేటాయింపులు చేస్తూ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. ఇక 16 సంస్థలకు గతంలో కేటాయింపులు చేసిన విస్తీర్ణంలో మార్పులు చేయడంతో పాటు వేరొక ప్రాంతాల్లో కేటాయింపులు చేస్తున్నామన్నారు.
ఇక 13 సంస్థలకు వివిధ కారణాలతో భూకేటాయింపులు రద్దుకు సబ్ కమిటీ అంగీకారం తెలిపిందని మంత్రి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో మూడు ముక్కలాట ఆడి రాజధానిని పక్కన పడేసిందని, అప్పట్లోనే 43 వేల కోట్లకు విలువైన పనులకు టెండర్లు పిలిచి 9 వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేసామన్నారు. అయితే వైసీపీ కక్ష సాధింపుతో అమరావతిపై మూడు ముక్కలాట ఆడిందని, .కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి 8 నెలలు పట్టిందని తెలిపారు.
48 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచి ఇప్పటికే ఏజెన్సీలను ఎంపిక చేసామని మంత్రి నారాయణ తెలిపారు. సీఆర్డీఏ అధారిటీ సమావేశంలో ఆమోదం పొందగానే ఆయా సంస్థలతో సీఆర్డీఏ అగ్రిమెంట్లు చేసుకుంటుందన్నారు. ఆ వెంటనే రెండు మూడు రోజుల్లో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు మంత్రి నారాయణ. ఎన్నికల కోడ్ ఉండటంతో టెండర్ల ప్రక్రియ ఆలస్యం అయిందని మరోసారి స్పష్టం చేశారు.
అలాగే రాజధాని కోసం ప్రజల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.భూముల అమ్మకాలతో మాత్రమే అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. ఖజానాపై భారం లేకుండా సీఎం చంద్రబాబు మంచి మోడల్ డిజైన్ చేసారని చెప్పారు. గతంలో అమరావతి కోసం జగన్ లక్ష కోట్లు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించారని...లక్ష కోట్లు అవసరం లేకుండానే రాజధాని నిర్మిస్తున్నామని మంత్రి పయ్యావుల అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను మభ్య పెట్టి వారితో ఆడుకున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications