రాజధాని: భూమి కొన్న ఆ ప్రముఖ నటుడు ఎవరు!?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజధానిని విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఏపీ మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.
తాజాగా ఓ నేత ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ.. ఓ సినీ నటుడు విజయవాడ ప్రాంతంలో 150 ఎకరాల భూమి కొన్నట్లుగా ప్రచారం జరుగుతోందని విమర్శించారు. రాజధాని పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం 12.17 నిమిషాలకు ప్రకటన చేయనున్నారని సమాచారం.
విజయవాడ పరిసరాలనే రాజధానిగా ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని పైన ప్రకటనకు ముందే చర్చ, ఓటింగ్కు పట్టుబడుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రానికి ఉపయోగపడేలా రాజధాని గురించి ఆలోచించాలని, రియాల్టర్లకు, వారి పార్టీ వారికి లబ్ధి చేకూర్చేలా ఆలోచించవద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చాలా రోజుల నుండి ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ నేత టీవీ ఛానల్తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బెజవాడ పరిసరాల్లో ఓ సినీ నటుడు 150 ఎకరాలు కొన్నారని వ్యాఖ్యానించారు. దీంతో ఆ నటుడు ఎవరనే చర్చ సాగుతోంది.