అమరావతి ప్రత్యేకత ఇదే: తొమ్మిది రంగుల్లో 9 నగరాలు
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో నిర్మించనున్న తొమ్మిది నగరాలకూ ఒక్కో రంగును ప్రత్యేకించి, తొమ్మిది రంగులతో మొత్తం రాజధానిని ప్రత్యేక ఆకర్షణగా నిలపాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ ‘పింక్ సిటీ'గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నేపథ్యంలో అమరావతికి కూడా ప్రత్యేక గుర్తింపు తీసుకు రావాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలో రాజధాని అమరావతిలో టూరిజం, ఆరోగ్యం, ఎలక్ట్రానిక్స్, విద్య, ప్రభుత్వ పాలన, జస్టిస్, స్పోర్ట్స్, ఆధ్యాత్మిక, ఆర్థిక నగరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తొమ్మిది నగరాలూ తొమ్మిది రంగుల్లో ఉండాలని కూడా ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
అంతేకాదు ఆయా నగరాల పరిధిలో నిర్మించే ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలన్నీ ఒకే రంగులో ఉండాలనే నిబంధనను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిని కొత్తగా నిర్మిస్తుండటంతో ఈ ప్రత్యేకతను సాధించడం సులభమేనని కూడా ప్రభుత్వం అంచనా వేస్తోంది.
రాజధాని అమరావతి నగర నిర్మాణం కార్యాచరణపై ఈరోజు సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాజధానికి వేసే రంగులతోపాటు రోడ్లు, నీరు, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలపైనా చర్చించనున్నారు. అంతేకాదు రాజధాని నగరాన్ని ఒకటి తర్వాత మరొకటి నిర్మించడం ద్వారా ఎక్కువ సమయం పడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
ఇందులో భాగంగా ఒక్కో నగరాన్ని ఒక్కో సంస్థకు అప్పగిస్తే ఒకే సమయంలో నిర్మాణ పనులు ప్రారంభమై, ఒకేసారి పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో బొటానికల్ గార్డెన్ను అటవీ శాఖకు, మ్యూజియంను టూరిజం శాఖకు, రహదారుల నిర్మాణాన్ని రోడ్లు భవనాల శాఖకు లేదా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు అప్పగించాలని యోచిస్తోంది.
అలాగే, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవన సముదాయాల నిర్మాణానికి సంబంధించి అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ సంస్థల మధ్య పోటీ పెట్టాలని భావిస్తోంది. మరోవైపు రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు సంక్రాంతి నాటికి స్థలాలను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కార్యక్రమాన్ని వీలైనంత వరకూ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని, లేకపోతే సంక్రాంతిలోగా రైతులకు స్థలాలు ఇవ్వాలని సీఆర్డీఏ భావిస్తోంది. రాజధాని నగర నిర్మాణంలో రహదారులు అత్యంత కీలక పాత్రను పోషిస్తాయని సీఆర్డీఏ అధికారులు భావిస్తున్నారు.