రాజధాని: మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూసమీకరణ పేరిట తమ భూములు బలవంతంగా లాక్కుంటే పురుగుల మందు తాగి చస్తామని గుంటూరు జిల్లా నిడమర్రు మహిళా రైతులు అధికారులను హెచ్చరించారు. పురుగుమందు డబ్బాలతో అధికారుల వద్ద నిరసన తెలిపారు. ఒక మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా రైతులు వారించారు. మరో మహిళా రైతు అధికారుల ఎదుట విలపించి సొమ్మసిల్లి పడిపోయింది.
తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో భూసమీకరణకు అభిప్రాయ సేకరణ జరుపుతున్న మంత్రివర్గ ఉప సంఘం ప్రతినిధుల తరపున సోమవారం సాయంత్రం మంగళగిరి మండలం నిడమర్రులో ఆర్డీవో భాస్కర్నాయుడు, తహశీల్దార్ చేబ్రోలు కృష్ణమూర్తి ఏర్పాటు చేసిన రైతుల సమావేశం రసాభాసగా ముగిసింది. సమావేశంలో పలువురు రైతులు మాట్లాడుతూ తమ గ్రామ పొలాల్లో మూడు పంటలు పండుతాయని, ప్రభుత్వం 6 కోట్ల రూపాయల నాబార్డ్ నిధులు వెచ్చించి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసిందని, రాజధాని కోసమని బంగారు పంటలుపండే భూముల్లో సెంటు కూడా ఇచ్చేదిలేదని వాదించారు.

భూసమీకరణ వల్ల మీకే మేలు జరుగుతుందని అధికారులు రైతులను ఒప్పించేందుకు ప్రయత్నించారు. మహిళా రైతులు పురుగుమందు డబ్బాలతో వేదిక వద్దకు ఆగ్రహావేశాలతో దూసుకొచ్చారు. భూములు ఇవ్వబోమని, బలవంతంగా లాక్కుంటే పురుగు మందు తాగి చస్తామని బిగ్గరగా అరుస్తూ హెచ్చరించారు. ఓ మహిళా రైతు కన్నీరుమున్నీరుగా విలపించింది. భూములు లాక్కోవద్దని వేడుకుంది. తమ అభిప్రాయమూ ఇదేనంటూ గ్రామస్థులు నినాదాలు చేశారు.
మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డిని పూలింగ్ కమిటీలోకి తీసుకోకపోవటాన్ని రైతులు నిరసించారు. ‘అధికారులు గోబ్యాక్.. చంద్రబాబు నాయుడు డౌన్డౌన్' అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రభుత్వం తరపున రైతులకు సందేశమివ్వాల్సిన ఆర్డీవో ఒక్కమాట కూడా మాట్లాడకుండానే వెనక్కి వెళ్లిపోయారు. వేదిక వద్దకు రైతులు దూసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.
సర్పంచ్ మండెపూడి మణెమ్మ, ఎంపిపి పచ్చల రత్నకుమారి, రైతు ప్రతినిధులు అంజిరెడ్డి, భాగ్యరాజు, భీమవరపు కృష్ణారెడ్డి, జంగా నాగిరెడ్డి, శ్రీమన్నారాయణరెడ్డి, సింహాద్రి లక్ష్మారెడ్డి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడారు. భూసమీకరణకు వ్యతిరేకంగా గ్రామ పంచాయతీ, గ్రామసభ ఇంతకుముందే చేసిన తీర్మాన ప్రతులను ఆర్డీవో, తహశీల్దార్కు వారు అందించారు.












Click it and Unblock the Notifications