ఏపీలో రెడ్డి వర్సెస్ కమ్మ పోరు-వార్ ఓపెన్ చేసేసిన జగన్, చంద్రబాబు-ఏం జరగబోతోంది ?
ఏపీలో రెడ్డి వర్సెస్ కమ్మ రాజకీయాలకు సుదీర్ఘ చరిత్రే ఉంది. ఎన్టీఆర్ 1982లో టీడీపీ స్ధాపించిన తర్వాత మొదలైన ఈ రాజకీయాలు ఇన్నాళ్లూ అంతర్గతంగానే సాగాయి. ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా, కమ్మ, రెడ్డి రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చినా లోలోపలే సాగిన ఈ రాజకీయాలు కాస్తా ఇప్పుడు ఓపెన్ అయిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబును పూర్తిగా టార్గెట్ చేయడమే ఇందుకు కారణం. ఇప్పటికీ వైసీపీ నేత సాయిరెడ్డి కులం పేరుతో చంద్రబాబును టార్గెట్ చేస్తుండటంతో కమ్మ నేతలంతా జగన్ కు వ్యతిరేకంగా ఓపెన్ అయిపోతున్నారు.
ఏపీలో రెడ్డి వర్సెస్ కమ్మ పాలిటిక్స్
ఏపీ చరిత్రలో రెడ్డి వర్సెస్ కమ్మ రాజకీయాలకు దశాబ్దాల క్రితమే బీజం పడింది. 1982 ముందు వరకూ సాగిన రెడ్ల ఆధిపత్యానికి చెక్ పెడుతూ ఎన్టీఆర్ టీడీపీని స్ధాపించడంతో ఈ వార్ మొదలైంది. ఆ తర్వాత ప్రతీ ఎన్నికల్లోనూ రెడ్ల మద్దతున్న కాంగ్రెస్ కూ, ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వాల్లోని టీడీపీతో వార్ సాగేది. వైఎస్ హయాం వరకూ సాగిన ఈ పోరు ఆయన మరణం తర్వాత మలుపు తీసుకుంది. ఆ తర్వాత వైఎస్ జగన్ స్ధాపించిన వైసీపీతో టీడీపీ పోరుగా మారింది. ఆ తర్వాత అది కాస్తా జగన్ వర్సెస్ చంద్రబాబు పోరుగా మారిపోయింది. రెండు ప్రాంతీయ పార్టీలకు అధినేతలుగా ఉన్నవీరి పోరు కాస్తా నేతల మధ్య పోరుగా రూపాంతరం చెందింది.
జగన్ వర్సెస్ చంద్రబాబు పోరు
ఏపీలో ప్రాంతీయ పార్టీలుగా ఉన్న టీడీపీ, వైసీపీ తమ కుల రాజకీయాలతో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల ప్రతినిధులుగా మారిపోయాయి. అంతే కాదు ఈ పోరుకు జగన్, చంద్రబాబు నాయకత్వం వహించడం కూడా మొదలైంది. దీంతో కమ్మ సామాజిక వర్గంపై పోరును చంద్రబాబుకు లింక్ చేస్తూ జగన్, రెడ్డి సామాజిక వర్గంపై పోరును టార్గెట్ జగన్ గా చంద్రబాబు మార్చేశారు. దీంతో జగన్ వర్సెస్ చంద్రబాబు పోరు హై ఓల్టేజ్ కుల రాజకీయంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఏపీలో పైకి కనిపించేంది జగన్ వర్సెస్ చంద్రబాబు పోరు అయితే లోలోపల సాగేది రెడ్డి వర్సెస్ కమ్మ రాజకీయమే అన్నది ప్రతీ ఒక్కరికీ అర్ధమైపోయింది.
జగన్ బీసీ కార్డుతో పతాకస్ధాయికి
ఒకప్పుడు కొత్త రాజకీయ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే బీసీల మద్దతుతో అధికారం అందుకున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత కూడా బీసీ రాజకీయాల్ని కొనసాగించారు. దీంతో టీడీపీ బీసీల పార్టీగా ముద్రపడిపోయింది. అయితే గత చంద్రబాబు హయాంలో ఏపీలో ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు,వ్యవహారశైలి బీసీల్ని టీడీపీకి దూరం చేసేశాయి. అలా దశాబ్దాల పాటు టీడీపీతో పాటు సాగిన బీసీల బంధం తెగిపోయింది. ఇదే అదనుగా వైసీపీ రంగంలోకి దిగి వారి మద్దతు పొందింది. 2019 ఎన్నికల్లో జగన్ బీసీ కార్డు ప్రయోగం ఫలించడంతో వైసీపీ ఏకంగా 151 సీట్లు అందుకుంది. దీంతో బీసీలకు కుప్పలు తెప్పలుగా మంత్రిపదవులు ఇవ్వడంతో పాటు కుల కార్పోరేషన్లను జగన్ తీసుకొచ్చారు. వాటికి నిధులు, కార్యాలయాలు లేకపోయినా జగన్ బీసీ కులరాజకీయం మాత్రం నిరాటంకంగా సాగుతోంది.
జగన్ పై కమ్మ నేతల ఫైర్
చంద్రబాబు మానసపుత్రికగా తెరపైకి వచ్చిన అమరావతి రాజధానిని ముంచేసి దాని స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తీసుకురావడంతో ద్వారా టీడీపీని జగన్ భారీ దెబ్బ కొట్టారు. అంతటితో ఆగకుండా కమ్మరావతి పేరుతో జనంలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కమ్మ రాజధాని కంటే అన్ని కులాలకు మూడు రాజధానులతో అభివృద్ధిని పంచుతానంటూ జగన్ చేస్తున్న ప్రచారంపై కమ్మ నేతలు మండిపడుతున్నారు. చేతనైతే అమరావతికి కమ్మరావతి పేరు పెట్టాలని తెలంగాణకు చెందిన కమ్మ సామాజికవర్గ సీనియర్ నేత రేణుకా చౌదరి నిన్న జగన్ కు సవాల్ విసిరితే. ఇవాళ వైసీపీ చంద్రబాబును బూచిగా చూపుతూ కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేయడంపై సినీ నిర్మాత బండ్ల గణేశ్ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారు. అదే సమయంలో జగన్ తాజా కేబినెట్ ప్రక్షాళనలో కమ్మ సామాజిక వర్గానికి చోటు కల్పించలేదు. దీంతో కమ్మ సామాజికవర్గాన్ని రెడ్డి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్న ఫీలింగ్ ను వీరు తెరపైకి తెస్తున్నారు.
మొహమాటాల్లేవ్.. ఇక అంతా ఓపెన్
రాష్ట్రంలో ఇన్నాళ్లూ టీడీపీ, వైసీపీ ఇరు పార్టీలు కమ్మ,రెడ్డి సామాజికవర్గాల ప్రతినిధులుగా చెలామణి అయ్యాయి. అయినా మిగతా సామాజికవర్గాల నుంచి వారికి మద్దతు లభించింది. కానీ పరస్పరం టార్గెట్ చేసుకునే క్రమంలో గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఈ వార్ కాస్తా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు బహిరంగంగానే రేణుకాచౌదరి, బండ్ల గణేశ్ వంటివారు జగన్, సాయిరెడ్డిపై విరుచుకుపడుతున్నారు. దీంతో మిగతా సామాజికవర్గాల్లోనూ రెడ్డి సర్కార్ పై అసంతృప్తి పెరుగుతోంది. ఇది రాబోయే ఎన్నికల్లో ఏ టర్న్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఏదేమైనా కుల రాజకీయాలు ఇంత ఓపెన్ కావడం ఏపీ రాజకీయాల పతనావస్ధకు అద్ధం పడుతోంది.