ఏపీలో కరోనా: జగనన్న గొంతుతడి పథకం.. సీఎం జిల్లాలో రైతుల గోస.. టీడీపీ దాడులు ముమ్మరం
దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు 50వేల మార్కుకు చేరువకాగా, ఆంధ్రప్రదేశ్లో అది 1800కు దగ్గరగా ఉంది. దక్షిణాదిలో తమిళనాడు తర్వాత మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రంగానూ ఏపీ కొనసాగుతున్నది. ఇలాంటి క్రిటికల్ టైమ్ లో ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిందిపోయి, మద్యం దుకాణాల గేట్లు ఎత్తేయడం ద్వారా సీఎం జగన్ రాష్ట్రాన్ని రిస్కులో పడేశారని ప్రతిపక్ష టీడీపీ ఆరోపించింది. అసలే కరోనా రాజకీయం పీక్స్లో ఉండగా, దానికి మద్యం మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈక్రమంలో సీఎంపై టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు.

కడప రైతుల గోడుపై చంద్రబాబు..
కరోనా విలయ కాలంలో మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోన్న ప్రభుత్వం.. రైతులను మాత్రం గాలికొదిలేసిందని, పంటల్ని అమ్ముకునే విషయంలో వారికి భరోసా కల్పించలేకపోయిందని ప్రతిపక్షనేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లా కడపలో గొల్లపల్లి రైతులు పంటను మార్కెట్లో అమ్ముకునే వీలులేక, నడిరోడ్డుపైనే కూరగాయలు పారబోసిన దృశ్యాలను చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘‘మద్యం అమ్మకాలకి అడ్డురాని నిబంధనలు రైతులు పంట అమ్మకానికి అడ్డొస్తున్నాయా? ఏమిటీ దారుణం?''అని ప్రశ్నించారు.

కర్ణాటక సీఎంకు టీడీపీ చీఫ్ లేఖ..
కరోనా లాక్ డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను పట్టించుకోవాల్సిందిగా సీఎం జగన్ కు రిక్వెస్ట్ చేసినా ఆశించిన ఫలితాలు రావడంలేదని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆవేదన చెందారు. తనకున్న పరిచయాల మేరకు ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే బుధవారం కర్ణాటక సీఎం యడ్యూరప్పకు లేఖరాశానన్నారు. కర్ణాటకలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు భోజన వసతి కల్పించాలని, వాళ్లను సొంత ఊళ్లకు పంపే ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు లేఖలో కోరారు.

జగనన్న గొంతుతడి పథకం
సీఎం జగన్ను ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన కామెంట్లు చేశారు. గతంలో తన తండ్రి వైఎస్సార్ను ముఖ్యమంత్రిని చేసిన సోనియా గాంధీకి జగన్ వెన్నుపోటు పొడిచారని, ఆ తర్వాతి కాలంలో సీఎం సీటు కోసం సొంత బాబాయి వివేకానే హత్యచేయించారని అయ్యన్న ఆరోపించారు. కరోనా విలయంలో మద్యాన్ని ఆదాయవనరుగా భావిచడం దారుణమన్న ఆయన.. దానిని ‘‘జగనన్న గొంతుతడి పథకం''గా అభివర్ణించారు. మద్యం అమ్మకాల ద్వారా వైసీపీ నేతలు కోట్ల రూపాయాలు దండుకుంటున్నారని ఆరోపించారు.

12 నెల్లో ఏపీ 10ఏళ్లు వెనక్కి..
మరో సీనియర్ నేత, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు సైతం సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైరస్ విలయతాండవం చస్తున్నవేళ మద్యం దుకాణాలు తెరిచి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఫైరయ్యారు. ‘‘ఒక ముద్దాయి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏవిధంగా నష్టపోతుందో ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. జగన్ లో నాయకుడికి ఉండాల్సిన లక్షణాలేవీ లేవు. అధికారంలోకి వచ్చిన 12 నెలల్లోనే తన తప్పుడు నిర్ణయాలతో ఏపీని 10 ఏళ్లు వెనక్కి నెట్టేశారు''అని వెంకట్రావు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications