సీఎం జన్మభూమి షెడ్యూల్ ఖరారు: అమరావతి నిర్మాణానికి మరో అడ్డంకి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ‘జన్మభూమి-మావూరు' కార్యక్రమంలో భాగంగా ఏపీలోని పలు జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్న సంగతి తెలిసిందే. ముందుగా శనివారం విజయనగరం జిల్లాలో మూడవ విడత జన్మభూమి కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
ఈ నెల 3న తిరుపతి, 4న ప్రకాశం, 5న కృష్ణా, 6న కర్నూలు, 7న చిత్తూరు, 8న పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు; 9న కడప; 10, 11, 12న విశాఖ; 13, 14 తేదీల్లో సొంత గ్రామమైన నారావారిపల్లె; 15న విజయవాడలో జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి.
కాగా, నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ అడ్డంకులు ఎదురయ్యాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి అటవీ భూమిని వినియోగించుకునేలా అనుమతి ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం పంపిన ఫైలును కేంద్రం తిప్పి పంపింది. అటవీ భూమిని బదలాయించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ ఫైలు పంపింది.
రాజధాని నిర్మాణం కోసం మొత్తం 19 వేల హెక్టార్ల భూమిని కోరడంపై కేంద్ర పర్యావరణ సలహా సమితి సందేహాలు వ్యక్తం చేసింది. డీ నోటిఫికేషన్కు సంబంధించిన సమాచారం అసంపూర్తిగా ఉందనే కారణంతో ఫైలుని తిప్పిపంపినట్లు సమాచారం. ఇప్పటికే రాజధాని నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.