పోలిటికల్ గేమ్: నష్టం లేదు, నంద్యాలకు చంద్రబాబు, చక్రంతిప్పుతున్న అఖిలప్రియ
పార్టీ నుండి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి బయటకు వెళ్ళిన ఎలాంటి నష్టం లేదని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియ టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు చెప్పారు.
నంద్యాల: పార్టీ నుండి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి బయటకు వెళ్ళిన ఎలాంటి నష్టం లేదని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియ టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు చెప్పారు. శిల్పా టిడిపికి రాజీనామా చేయడంతో నెలకొన్న పరిస్థితులపై బాబు పార్టీ నాయకులతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో టిక్కెట్టు కేటాయింపు విషయంలో టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు నుండి శిల్పాకు స్పష్టమైన హమీ రాలేదు. దీంతో ఆయన టిడిపిని వీడాలని నిర్ణయించుకొన్నారు.ఈ మేరకు ఆయన సోమవారం నాడు పార్టీకి రాజీనామాచేస్తున్నట్టు ప్రకటించారు.
జూన్ 14న, తన అనుచరులతో కలిసి శిల్పా మోహన్ రెడ్డి .... జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.ఈ మేరకు ఆయన తన అనుచరులతో సమావేశమైన తర్వాత టిడిపిని వీడాలని నిర్ణయం తీసుకొన్నారు.
నంద్యాలలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు జాగ్రత్తలు తీసుకొన్నారు. మంత్రులను రంగంలోకి దించారు. పార్టీకి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ఆయన ముందుజాగ్రత్త చర్యలను తీసుకొంటున్నారు.
ఎలాంటి నష్టం లేదు
మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి పార్టీని వీడడం వల్ల ఎలాంటి నష్టం లేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ చంద్రబాబుకు తేల్చి చెప్పారు. నంద్యాలలో చోటుచేసుకొన్న పరిణామాలనేపథ్యంలో టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ నాయకులతో మంగళవారం నాడు టెలికాన్పరెన్స్ నిర్వహించారు. శిల్పా మోహన్ రెడ్డితో పార్టీని వీడే నాయకులు ఎవరనే విషయమై బాబు ఆరాతీశారు. అయితే శిల్పాతో వెళ్ళే నాయకులు పెద్దగా ఉండబోరని అఖిలప్రియ హమీ ఇచ్చారు.
భూమా కుటుంబానికి లైన్ క్లియర్
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీచేసే విషయమై భూమా కుటుంబానికి లైన్ క్లియరైంది. టిడిపికి శిల్పా మోహన్ రెడ్డి గుడ్ బై చెప్పడంతో భూమా కుటుంబానికి ఈ స్థానం నుండి టిడిపి టిక్కెట్టు విషయంలో పోటీ లేకుండాపోయింది.భూమా అఖిలప్రియ సోదరుడు బ్రహ్మనందరెడ్డిని ఈ స్థానం నుండి ఆ కుటుంబం రంగంలోకి దించే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే బ్రహ్మనందరెడ్డి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
చంద్రబాబు పర్యటన
ఈ నెల 21వ, తేదిన నంద్యాలలో పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకుగాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాలలో పర్యటించనున్నారు. నంద్యాలలో గృహ నిర్మాణ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. 2014 ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి ప్రజలకు ఇచ్చిన హమీలను నేరవేర్చే క్రమంలోనే ఈ పథకానికి బాబు శంకుస్థాపన చేయనున్నారు.
ఉపఎన్నికల షెడ్యూల్ రాకముందే వేడేక్కిన రాజకీయం
నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే రాజకీయం వేడేక్కింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భూమా అఖిలప్రియ నంద్యాలను కేంద్రంగా చేసుకొని అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారు.ప్రధానంగా తన తండ్రి ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకు ఆమె వేగంగా పనులను చేస్తున్నారు. అయితే నంద్యాల కేంద్రంగా చేసుకొని అఖిలప్రియ కార్యక్రమాలను చేపట్టడాన్ని శిల్పావర్గం వ్యతిరేకించింది. అయితే శిల్పా టిడిపికి రాజీనామా చేయడంతో ఇక భూమా అఖిలప్రియకు అడ్డంకులు లేకుండా పోయాయి.