భారత్-పాక్ కాల్పుల విరమణ-చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ జోరుగా సాగిపోతున్న వేళ ఇవాళ హఠాత్తుగా పాకిస్తాన్ వెనక్కి తగ్గడంతో ఇరు దేశాలూ కాల్పుల విరమణ ప్రకటించాయి. అంతే కాదు తక్షణం దీన్ని అమల్లోకి కూడా తెచ్చేశాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దీనిపై ఎన్డీయే కీలక భాగస్వామి అయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
భారత్-పాక్ యుద్ధ కాల్పుల విరమణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ విజయవాడ రాజ్ భవన్ కు వచ్చిన సందర్బంగా స్పందించారు. తాము కాల్పుల విరమణను స్వాగతిస్తున్నామని, ఇది సానుకూల ఫలితమని ఆయన తెలిపారు.
పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను పరిగణనలోకి తీసుకున్నారని ఆయన తెలిపారు. ఈ నెల 12న ఇరుదేశాల మధ్య మళ్లీ చర్చలు జరుగుతాయన్నారు.

రాజ్ భవన్లో జరిగిన సర్వమత సమావేశంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో కలిసి చంద్రబాబు ప్రసంగించారు. భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ సానుకూల ఫలితమని, దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి తమ హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఓ తీర్మానాన్ని ఆమోదించుకుందామన్నారు.
ఉగ్రవాదం నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పుగా మిగిలిపోయిందని చంద్రబాబు తెలిపారు. దేశమే ముందుంది అనేది మన సమిష్టి నినాదం కావాలన్నారు. జాతీయ సంక్షోభ సమయాల్లో ఐక్యంగా నిలబడి కలిసి ముందుకు సాగడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజాస్వామ్యంలో, విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రజలు దేశం కోసం కలిసి రావడం గొప్ప గౌరవం అన్నారు.












Click it and Unblock the Notifications