రఘురామ ఎఫ్ఐఆర్లో సంచలనం-రెడ్లు, క్రిస్టియన్ల టార్గెట్- టీవీ5, ఏబీఎన్ సాయం
ఏపీ ప్రభుత్వంతో పాటు సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. నిన్న మధ్యాహ్నం ఆయన్ను హైదరాబాద్లో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. రాత్రి కల్లా గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ జరిపారు. రాత్రికి రాత్రే వైద్య పరీక్షలు నిర్వహించి ఇవాళ మరోసారి విచారణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఈ కేసులో రఘురామరాజు వేసిన పిటిషన్ను విచారించిన ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
నేడు మరోసారి రఘురామ విచారణ
వైసీపీ ప్రభుత్వానికీ, సీఎం జగన్కు వ్యతిరేకంగా పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఇవాళ మరోసారి విచారించేందుకు సీఐడీ అధికారులు సిద్దమవుతున్నారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలోనే ఆయన్ను ఉంచిన అధికారులు ఉదయం టిఫిన్ ఇచ్చారు. వైద్యపరీక్షలు నిర్వహించడంతో పాటు మరోసారి ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం, సీఎం జగన్పై రఘురామ చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఎవరున్నారనే విషయంలో సీఐడీ అధికారులు ఇవాళ కూపీ లాగనున్నారు.
రెడ్లు, క్రిస్టియన్లను టార్గెట్ చేశారంటూ
ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్పై రఘరామకృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో తాము సుమోటో కేసు నమోదు చేసినట్లు సీఐడీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. గౌరవ ఎంపీ తన వ్యాఖ్యలు, హావభావాల ద్వారా ప్రజల్లో విద్వేషభావం నింపేలా ప్రవర్తించారని, ప్రజల్లో హింస ప్రజర్విల్లేలా వ్యవహరించారని పేర్కొంది. రెడ్డి, క్రిస్టియన్ సామాజిక వర్గాల్ని లక్ష్యంగా చేసుకుని, వారికి ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారని తెలిపింది. తద్వారా ఆయా వర్గాల మధ్య చిచ్చు రేపి ప్రభుత్వ వ్యతిరేకంగా కుట్ర చేశారని సీఐడీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
ఎఫ్ఐఆర్లో టీవీ 5, ఏబీఎన్
ఏ1గా రఘరామకృష్ణంరాజును, ఏ2గా రెండు మీడియా ఛానళ్ల పేర్లను చేర్చారు. రఘురామ చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేయడం ద్వారా ప్రజల్లో అలజడికి కారణమైనట్లు టీవీ 5, ఏబీఎన్ ఛానళ్లపై సీఐడీ ఎఫ్ఐఆర్లో అభియోగాలు మోపారు. మంగళగిరి సీఐడీ పీఎస్లో 124ఏ,153ఏ, రెడ్విత్ 120బి, 505 సెక్షన్ల కింద ఈ రెండు ఛానళ్లపై కేసులు పెట్టారు. ఈ రెండు ఛానల్స్ రఘురామకృష్ణంరాజు కోసం స్లాట్లు కేటాయించి వార్తలు ప్రసారం చేశారని, వీరంతా కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నినట్లు సీఐడీ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
హైకోర్టు ఏం చెప్పింది ?
తన అరెస్టుపై రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన హౌస్మోషన్ పిటిషన్పై విచారమ జరిపిన హైకోర్టు.. కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణ పూర్తయ్యే వరకూ మెజిస్ట్ర్టేట్ ముందు ఆయన్ను హాజరుపరచవద్దని సీఐడీకి సూచించింది. పోలీసు కస్టడీలో ఉన్న పార్లమెంటు సభ్యుడికి తగిన సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. ఆహారం, వైద్యంతో పాటు వసతికితగిన వెసులుబాటు ఇవ్వాలని సీఐడీకి ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. ఇవాళ మధ్యాహ్నం మరోసారి ఈ కేసుపై హైకోర్టు విచారణ జరపనుంది.
Recommended Video