అమరావతిపై చురుగ్గా సీఐడీ దర్యాప్తు-సీఆర్డీయే మాజీ కమిషనర్ శ్రీధర్ విచారణ
అమరావతి భూముల వ్యవహారంలో దాఖలైన కేసులపై ఏపీ సీఐడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అసైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై దాఖలైన కేసులపై ఈ దర్యాప్తు సాగుతోంది. ఇందులో సీఆర్డీయే మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్తో పాటు అమరావతి రైతుల్ని ప్రశ్నిస్తున్నారు.
అమరావతిలో అసైన్డ్ భూముల్ని దళిత రైతులకు దక్కకుండా జీవో 41 జారీ చేసి అన్యాయం చేశారని ఆరోపిస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సీఐడీ అధికారులు చంద్రబాబు, నారాయణపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనిపై ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఇద్దరికీ నోటీసులు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ హైకోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి.

ఓవైపు అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టులో వాదనలు సాగుతుండగానే.. మరోవైపు సీఐడీ అధికారులు మాజీ సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్తో పాటు మందడం గ్రామానికి చెందిన దళిత రైతుల్ని ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సీఐడీ వర్గాలు చెప్తున్నాయి. అయితే కేసు పెట్టాక సాక్ష్యాలు, ఆధారాల కోసం సీఐడీ అన్వేషణ సాగించడం అనుమానాలకు తావిస్తోంది. అలాగే అట్రాసిటీ కేసును దళితులు కాకుండా ఎమ్మెల్యే ఆర్కే పెట్టడంపైనా విమర్శలు వస్తున్న నేపథ్యంలో రైతులతోనే కేసులు పెట్టించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications