రఘురామపై నేడు ఏపీ సీఐడీ విచారణ-హైదరాబాద్ దిల్ కుషాలో -నోటీసులు వారికివ్వలేదని ఆక్రోశం !
ఏపీలో గతంలో చేసిన విద్వేష వ్యాఖ్యల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు విచారణకు హాజరవ్వాలని ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. గతవారం ఈ నోటీసులు జారీ చేసిన సీఐడీ.. హైదరాబాద్ లోని దిల్ కుషా గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరుకావాలని కోరింది.
హైదరాబాద్ లోని దిల్ కుషా గెస్ట్ హౌస్ లో ఇవాళ జరిగే విచారణకు రఘురామకృష్ణంరాజును హాజరుకావాలని గతవారం ఇచ్చిన నోటీసులకు ఆయన సమాధానం కూడా ఇచ్చారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు టీవీ ఛానళ్లకు మాత్రం నోటీసులివ్వకపోవడంపై రఘురామ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం తనను టార్గెట్ చేసి సీఐడీ నోటీసులిచ్చినట్లు రఘురామ తన సమాధానంలో పేర్కొన్నారు. అయితే ఈ రెండు ఛానళ్లను సీఐడీ ప్రస్తుతానికి విచారణకు పిలవడం లేదని తెలుస్తోంది.
మరోవైపు ఇవాళ దిల్ కుషా గెస్ట్ హౌస్ లో జరిగే సీఐడీ విచారణకు రఘురామరాజు హాజరవుతారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో ఇదే కేసులో సుప్రీంకోర్టు వరకూ వెళ్లి బెయిల్ తెచ్చుకున్న రఘురామరాజు.. అనంతరం సుప్రీం ఆదేశాల మేరకు హైకోర్టు విచారణ ఎదుర్కొన్నారు. చివరికి హైదరాబాద్ లో తనను విచారణ చేయాలనే షరతు కూడా పెట్టారు. దీనికి అంగీకరించిన హైకోర్టు.. దిల్ కుషా గెస్ట్ హౌస్ లో విచారణ జరపాలని సీఐడీని ఆదేశించింది. ఇవాళ విచారణకు రఘురామ వస్తే సరి. లేకపోతే సీఐడీ ఏం చేయబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.