ఖాతాదారుల బంగారం తాకట్టు: రూ.3 కోట్లు అప్పు తీసుకొన్నబ్యాంకు ఉద్యోగి
విజయవాడ:విజయవాడ ఎస్బిఐలో బంగారం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఎస్బిఐ ఉద్యోగి కృష్ణ చైతన్య బ్యాంకులో తాకట్టుపెట్టిన బంగారాన్ని మణప్పురంలో తాకట్టు పెట్టి రుణం తీసుకొన్నారు. బ్యాంకు అధికారులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విజయవాడలోని గాయత్రినగర్ ఎస్బీఐలో బంగారు నగలను కుంభకోణం చోటుచేసుకొన్న విషయాన్ని బ్యాంకు అధికారులు గుర్తించారు. ఇందులో బ్యాంకులో పనిచేసే ఉద్యోగి కృష్ణ చైతన్య కీలకంగా వ్యవహరించారని అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఖాతాదారులు తమ బ్యాంకులో ఉంచిన బంగారు నగలను మాచవరంలోని మణప్పురంలో తాకట్టు పెట్టి ఎస్బీఐ ఉద్యోగి కృష్ణచైతన్య రుణం తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. సీఐడీ పోలీసులు మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు.
దీంతో కృష్ణ చైతన్య చేసిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఖాతాదారుల నగలు తాకట్టు పెట్టి కృష్ణ చైతన్య ఏకంగా మూడు కోట్ల రూపాయల రుణం తీసుకున్నాడని సీఐడీ అధికారులు తేల్చారు. మణప్పురంకు చెందిన ఇతర శాఖల్లోనూ తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. మాచవరం మణప్పురం కార్యాలయంలో కృష్ణ చైతన్య ఏకంగా 10 కిలోల బంగారం తాకట్టు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. కృష్ణచైతన్యతో పాటు మణప్పురం సిబ్బందిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.