ఏపీలో సినిమా థియేటర్ల మూసివేత..!! అగ్ర హీరోల సినిమాల విడుదల వేళ : ఏం జరుగుతోంది..!!
ఏపీలో ఇప్పుడు సినిమా ధియేటర్లలో కొనసాగుతున్న సోదాలు కలకలం రేపుతున్నాయి. అంతటితో ఆగకుండా నోటీసులు ఇవ్వటం.. కొన్ని థియేటర్లు మూసివేయటంతో ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకోసం తొలుత ఈ రోజున విజయవాడలో భేటీ కావాలని భావించారు. అయితే, ప్రభుత్వం జారీ చేసిన టిక్కెట్ల ధరల తగ్గింపు జీవో పైన ఈ రోజున హైకోర్టులో విచారణ ఉంది. కోర్టు విచారణ..మార్గదర్శకాలకు అనుగుణంగా తమ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసేందుకు ఈ సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేసారు.
Recommended Video

టిక్కెట్ల ధరల తగ్గింపుతో ఆందోళన
సెంటర్ల వారీగా ప్రభుత్వం టిక్కెట్ల ధరలు ఖరారు చేసింది. వాటిని అమలు చేస్తే తాము అసలు థియేటర్లను మెయిన్ టెయిన్ చేయలేమని యజమానులు వాపోతున్నారు. ఇక, టిక్కెట్ ధరల ఖరారు పైన జిల్లా జాయింట్ కలెక్టర్లకు అధికారం అప్పగించారు. తాజాగా ధియేటర్లలో నాలుగు రోజుల నుంచి పెద్ద ఎత్తున అధికారులు..సోదాలు నిర్వహిస్తున్నారు. క్రిష్ణా జిల్లాలో ఏకంగా 12 సినిమా హాళ్లను సీజ్ చేసారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకు థియేటర్లలో తనిఖీలు చేస్తున్నారు. సీట్లు..పదార్ధాల విక్రయ ధరలు.. టాయిలెట్స్ నిర్వహణ వంటి వాటి పైన ఫోకస్ పెడుతున్నారు.

పెద్ద ఎత్తున తనిఖీలు మొదలు
ఎక్కడైనా అధిక ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్నారా అనే అంశం పైన ఆరా తీస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ పరంగా అగ్రి మాపక శాఖతో పాటుగా అవసరమైన అన్ని లైసెన్సులు ఉన్నాయా లేదా అనే అంశం పైన తనిఖీలు చేస్తున్నారు. దీంతో..ఎగ్జిబిటర్లు కలవర పడుతున్నారు. రెండేళ్ల పాటు కరోనా కారణంగా తాము నష్టపోయామని..ఇప్పుడు టిక్కెట్ ధరల తగ్గింపు తో పాటుగా తనిఖీల నిర్వహణ..థియేటర్ల సీజ్ నిర్ణయాలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో సినిమా థియేటర్లను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు.

సినిమా ధియేటర్ల సీజ్.. జరిమానాలు
ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే టికెట్ల అమ్మకాలు కొనసాగించాలని అధికారులు చెప్పడంతో బుధవారం నుంచి థియేటర్లను మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. జిల్లాలో 50కి పైగా థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లోని థియేటర్లను ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు ప్రాంతాల్లో థియేటర్లకు జరిమినా విధిస్తున్నారు. ఇక, ఈ అంశం పైన టాలీవుడ్ ప్రముఖులు జోక్యం చేసుకోవాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యల పైన చర్చించేందుకు సమయం ఇవ్వాలని అడుగుతున్నారు.

స్వచ్చందంగా మూసివేత నిర్ణయం
పలువురు టాలీవుడ్ ప్రముఖుల చేతిలోనే అనేక ప్రాంతాల్లోని సినిమా థియేటర్లు ఉన్నాయనేది మరో వాదన. దీంతో..ఈ రోజున కోర్టు లో జరిగే పరిణామాల తరువాత..ఎగ్జిబిటర్లు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ డిసైడ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విధంగా తనిఖీలు కొనసాగితే ఏం చేయాలనే దాని పైన నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే టిక్కెట్లు విక్రయించాల్సిన పరిస్థితులు తప్పదనుకుంటే..అసలు తాము కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టలేమని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు.

భారీ బడ్జెట్ సినిమాల విడుదలకు ముందు కొత్త టెన్షన్
దీంతో..పెద్ద హీరోల సినిమాల విడుదలకు ముందు ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలతో నిర్మాతలు - దర్శకులు సైతం ఆందోళన పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఏపీ హైకోర్టులో టిక్కెట్ ధరల పైన ఏం జరుగుతుందో చూసిన తరువాత టాలీవుడ్ ముఖ్యులు ఏపీ ప్రభుత్వంతో చర్చించే ఆలోచనలు సైతం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జనవరి తొలి వారం నుంచి సంక్రాంతి సందర్భంగా ఆర్ఆర్ఆర్...రాధే శ్యామ్ వంటి సినిమాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే పుష్ప సినిమా ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. దీంతో...మొత్తంగా ఇప్పుడు అందరూ కోర్టు వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఆ తరువాత కీలక పరిణామాల దిశగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications