ఏపీలో సినీ టికెట్ల వివాదం సశేషం- ఈ నెల 17న సర్కార్ కమిటీ భేటీ- జగన్ వ్యాఖ్యల వెనుక ?
ఏపీలో సినీ టికెట్ల ధరల వివాదానికి సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెట్టేసినట్లే అని అందరూ అనుకుంటున్న వేళ.... ఆయన టాలీవుడ్ ప్రముఖులతో భేటీలో చేసిన వ్యాఖ్యలు దీనిపై మరో చర్చకు తావిచ్చాయి. చిన్నా, పెద్దా అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేట్ ఉండాలనేది ప్రభుత్వ విధానమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అదే అంశంంపై టాలీవుడ్ ప్రముఖులు చర్చలు జరిపినా, ప్రభుత్వ కమిటీ సంప్రదింపులు జరుపుతున్నా ఇంకా ఫుల్ స్టాప్ పడలేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సినీ టికెట్ల ధరల రచ్చ
ఏపీలో సినీ టికెట్ల ధరల వివాదం ఇంకా ముగిసినట్లు కనిపించడం లేదు. నిన్న టాలీవుడ్ ప్రముఖులతో భేటీ అయిన సీఎం జగన్ సినీ టికెట్ల ధరల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసినట్లే అని అంతా అనుకున్నారు. జగన్ తో చర్చల తర్వాత టాలీవుడ్ ప్రముఖులు బయటికి వచ్చి జగన్ తో చర్చలు సానుకూలంగా జరిగాయని, సినీ పరిశ్రమకు మేలు చేసేందుకు జగన్ కట్టుబడి ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత సినీ పెద్లలతో జగన్ జరిపిన చర్చల వివరాలు బయటికి వచ్చాయి. ఇందులో జగన్ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.
జగన్ వ్యాఖ్యలతో ట్విస్ట్
టాలీవుడ్ ప్రముఖులతో నిన్న జరిగిన భేటీలో సీఎం జగన్... చిన్న సినిమాలకైనా, పెద్ద సినిమాలకైనా ఒకటే టికెట్ రేటు ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన అంటూ చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారంలో ట్విస్టుగా మారాయి. ఇదే అంశంపై టాలీవుడ్ పెద్దల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారన్న దానిపై చర్చ జరుగుతోంది. అదే సమయంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఇంకా సీఎం జగన్ కు రిపోర్ట్ ఇవ్వలేదు. ఇంకా చర్చించాల్సిన అంశాలు ఉండటమే ఇందుకు కారణం. అయితే టికెట్ రేట్లపై కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే రేట్లు ఉండే అవకాశాలు ఉండబోతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ కమిటీ నివేదికే కీలకంగా మారింది.
17న కమిటీ మరో భేటీ
సినిమా టికెట్ల ధరల వివాదంతో సహా పలు అంశాలపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమై చర్చలు జరిపింది. ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులు జగన్ తో జరిపిన చర్చల తర్వాత మరోసారి భేటీకి సిద్ధమవుతోంది. ఈ నెల 17న ప్రభుత్వ కమిటీ మరోసారి సమావేశం కాబోతోంది. దీంతో ఈ భేటీలో ఏ సినిమాకు ఎంత టికెట్ రేటు ఉండాలనే అంశంపై క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుుందా లేక కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కమిటీ నివేదిక తర్వాత ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించే అవకాశముంది.