ఎన్నికల పంచాయితీ తేలిపోతుందా: నేడే సుప్రీంలో విచారణ: ఎన్నికల కమిషన్ కేవియట్..!
ఏపీలో రాజకీయ వివాదంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వ్యవహారం పైన ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది.
ఈ మేరకు నేటి విచారణల జాబితాలో ఇది ఏడో కేసుగా నమోదైంది. తొలి ఆరు కేసుల విచారణ అనంతరం అరగంట విరామం తరువాత తిరిగి ధర్మాసనం తదుపరి కేసులను విచారించనున్నట్టు సుప్రీంకోర్టు నోటీసులో స్పష్టం చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సైతం సుప్రీంలో కేవియట్ దాఖలు చేసింది. దీంతో..ఈ రోజు సుప్రీం ఈ వివాదానికి సంబంధించి ఏమైనా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందా అనే ఉత్కంఠ రాజకీయంగా నెలకొని ఉంది.
ఏపీ ప్రభుత్వం పిటీషన్..ఇదీ వాదన
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను అనూహ్యంగా వాయిదా వేయటం పైన ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం అటు హైకోర్టు..ఇటు సుప్రీం కోర్టులోనూ పిటీషన్లు దాఖలు చేసింది. ప్రభుత్వం దాఖుల చేసిన పిటీషన్ లో పలు అంశాలను ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరమే ఎన్నికలు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు గతంలో కిషన్సింగ్ తోమర్ కేసులో ఇచ్చిన తీర్పును రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉల్లంఘించిందని ఏపీ ప్రభుత్వం ఈ పిటిషన్లో పేర్కొంది.
కోవిడ్-19 నిరోధించడంలో స్థానిక సంస్థల పాత్ర
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ఇ, 243యు లో నిర్ధేశించిన మేరకు మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక సంఘాల కాలపరిమితి ముగిసినందున ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, ప్రతివాది దీనిని గౌరవించలేదని వెల్లడించింది. మార్చి 31లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తికాని పక్షంలో 14వ ఆర్థిక సంఘం నిధులకు కాలం చెల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర రోజువారీ పాలనలో మాత్రమే కాకుండా కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడంలో స్థానిక సంస్థల పాత్ర కీలకమని పిటిషన్లో పేర్కొంది. మార్చి 15న ఎన్నికల సంఘం జారీచేసిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరింది.
Recommended Video
కేవియట్ దాఖలు చేసిన ఎన్నికల సంఘం
రాష్ట్ర ప్రభుత్వవ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేయటం..ఈ రోజు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణకు వస్తుండటంతో..ఎన్నికల సంఘం ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుడా నిర్ణయం ప్రకటించవద్దని అభ్యర్ధించినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో అటు ఏపీ హైకోర్టులో ప్రభుత్వం ఇదే రకమైన పిటీషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఎన్నికలను వాయిదా వేస్తూ జారీ చేసిన నోటిఫికేషన రద్దు చేయాలని ప్రభుత్వం కోరింది. అయితే, సుప్రీంలోనూ దీని పైన విచారణ ఉండటంతో..గురువారం నాటికి హైకోర్టు వాయిదా వేసింది. ఇక, ఈ రోజు సుప్రీంలో బెంచ్ మీదకు ఈ వ్యాజ్యం వస్తుండటం...తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కరోనా గురించి జాతీయ స్థాయిలో తాను ఆరోగ్య శాఖ కార్యదర్శితో చర్చించిన తరువాతనే నిర్ణయం తీసుకున్నామని చెప్పటంతో.. కోర్టు ముందు అటు ప్రభుత్వం...ఇటు ఎన్నికల సంఘం వాదనలు ఏ రకంగా ఉంటాయి..కోర్టు ఏమైనా సూచనలు చేస్తుందా..ఎన్నికల వ్యవహారం ఏమైనా స్పష్టత వస్తుందా అనే ఉత్కంఠ అటు అధికార పార్టీతో పాటుగా రాజకీయంగానూ ఆసక్తి నెలకొని ఉంది.