మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం !
హైదరాబాద్లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై శనివారం చోటుచేసుకున్న దాడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్పై తప్పుడు కథనాలు ప్రసారించారని ఆరోపిస్తూ.. బీఆర్ఎస్ కార్యకర్తలు మహా న్యూస్ కార్యాలయంపై దాడికి దిగారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్, స్టూడియోను ధ్వంసం చేయడంతో పాటు, ఆఫీస్ వెలుపల నిలిపిన వాహనాలను కూడా పగులగొట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహా న్యూస్ సిబ్బందిపై కూడా కొందరు దాడికి పాల్పడ్డట్టు సమాచారం.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు ఎలాంటి స్థానం లేదని ఆయన పేర్కొన్నారు. మీడియా సంస్థలపై దాడి చేయడం అత్యంత దారుణమైన చర్యగా అభివర్ణించారు. బెదిరింపులు, బలవంతపు చర్యలతో మీడియా స్వేచ్ఛను ఆపాలనే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని స్పష్టం చేశారు. ఈ ఘటనతో మహా న్యూస్ యాజమాన్యం, సిబ్బంది, జర్నలిస్టులకు ఆయన తన పూర్తి సంఘీభావం ప్రకటించారు.

అలానే ఈ దాడిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. "మీడియా సంస్థలు ప్రసారం చేసే కథనాలపై అభ్యంతరాలు ఉంటే, వాటిని వ్యక్తీకరించేందుకు చట్టబద్ధమైన, ప్రజాస్వామ్య మార్గాలున్నాయన్నారు. కానీ నేరుగా భౌతిక దాడులకు పాల్పడడం అత్యంత గర్హనీయమైన చర్య" అని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని, మీడియా గొంతు నొక్కే యత్నాలను ఏ ఒక్కరూ సహించకూడదని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై తక్షణం స్పందించి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ ఘటన రాజకీయ, మీడియా వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. పత్రికా స్వేచ్ఛకు గౌరవంగా, ప్రభుత్వ వ్యవస్థలు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. హైదరాబాద్ లోని ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది… pic.twitter.com/tpfOGXHFPO
— N Chandrababu Naidu (@ncbn) June 28, 2025
మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై దాడి గర్హనీయం
— JanaSena Party (@JanaSenaParty) June 28, 2025
హైదరాబాద్ లోని మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడి గర్హనీయం. మీడియాలో ప్రసారమయ్యే, ప్రచురితమయ్యే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేసే విధానం ఒకటి ఉంటుంది. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడటం సమంజసం కాదు.…












Click it and Unblock the Notifications