నాకు ఉద్యోగమిస్తే... నీ ఉద్యోగం ఊడుతుంది!: సర్వే ఎన్యూమరేటర్తో చంద్రబాబు
అమరావతి: ఈ మధ్య కాలంలో సందర్భం దొరికినప్పుడల్లా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్తంత హాస్య చతురతను ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికార సర్వేలో భాగంగా చంద్రబాబు తనదైన చమత్కారంతో జనాన్ని నవ్వులతో ముంచెత్తారు.
వివరాల్లోకి వెళితే... శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ప్రజా సాధికార సర్వే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరాల సేకరణలో లాంఛనంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లా ఉండవల్లి పరిధిలోని లింగమనేని హౌస్ లో ఉంటున్న చంద్రబాబు వద్దకు వివరాల సేకరణకు నిన్న ఉదయం గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికార యంత్రాంగంతో కలిసి వెళ్లారు.
Launched Smart Pulse Socio-economic Survey today. 30,000 enumerators will survey 1.48 cr households in AP. (1/3) pic.twitter.com/Z0DemTYKNt
— N Chandrababu Naidu (@ncbn) July 8, 2016
ఈ సందర్భంగా తన వివరాలు సేకరించేందుకు రంగంలోకి దిగిన ఎన్యూమరేటర్కు తనదైన శైలిలో చలోక్తులు విసిరి అక్కడి వారినందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. సర్వేలో భాగంగా సీఎం నుంచి 80 ప్రశ్నలకు వివరాలను సేకరించే క్రమంలో ఎన్యూమరేటర్ ఆయన 'ఉద్యోగం' గురించి ప్రస్తావించారు.
ఈ సందర్భంగా తనకు ఉద్యోగం లేదని వ్యాఖ్యానించిన చంద్రబాబు నీవేమైనా ఇస్తావా? అని సరదా కామెంట్ చేశారు. ఈ కామెంట్తో షాక్ తిన్న సదరు ఎన్యూమరేటర్ నోరు విప్పేలోగానే మరోమారు చంద్రబాబే అదుకుని ''నన్ను నిరుద్యోగి అనుకుని సంక్షేమ పథకాలు ఏమైనా మంజూరు చేసేవు. నీ ఉద్యోగం పోతుంది'' అని అనడంతో సదరు ఎన్యూమరేటర్తో పాటు అక్కడున్న వారంతా ఫక్కున నవ్వేశారు.
శాశ్వత నివాసం లేదు: ముఖ్యమంత్రి చంద్రబాబు
దీంతో పాటు చంద్రబాబు తనకు శాశ్వత నివాసం లేదని చెప్పారు. ప్రస్తుతం తాను నివాసముంటున్న లింగమనేని హౌస్ ఆర్సీసీ శ్లాబ్ రకానికి చెందినదని చెప్పిన ఆయన, ఈ భవంతిని ప్రభుత్వం అద్దెకు తీసుకుందని చెప్పారు. ఆ నివాసం సొంతమా? అద్దె ఇల్లా? అని ప్రశ్నించిన ఎన్యూమరేటర్ ప్రశ్నలకు స్పందించిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
''సొంతమంటే కబ్జా అంటారు. ఈ భవనాన్ని ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. ఇంకా స్వాధీనం చేసుకోలేదు'' అని ఆయన అసలు విషయాన్ని వెల్లడించారు. గతంలో హైదరాబాద్ నుంచి చంద్రబాబు తన పాలనను విజయవాడకు మార్చిన తర్వాత 'లింగమనేని హౌస్' పై ప్రతిపక్షాలు పెద్ద రాద్దాంతాన్ని చేసిన సంగతి తెలిసిందే.
అక్రమ కట్టడాలన్నింటికీ నోటీసులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం లింగమనేని హౌస్ను ఎలా వదిలేసిందని, అంతేకాకుండా వివాదాల్లో చిక్కుకున్న సదరు భవంతిలో చంద్రబాబు ఎలా నివాసముంటారని వైసీపీ ప్రశ్నించింది. దీంతో పాటు ఆ భవంతిని చంద్రబాబు తన సొంతం చేసుకున్నారని కూడా ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ వివాదంపై శుక్రవారం నిర్వహించిన ప్రజా సాధికార సర్వేలో చంద్రబాబు తనదైన శైలిలో సమాధానమిచ్చి తెర దించారు.
ఉద్యోగం: లేదు (ఉద్యోగం లేదు ఇస్తావా? అని సర్వే అధికారిని ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు. నిరుద్యోగిని అనుకొని సంక్షేమ పథకాలు ఏమైనా మంజూరు చేసేవు. నీ ఉద్యోగం పోతుంది అంటూ చమత్కరించారు)
సొంతమా? అద్దెకా?: ప్రభుత్వ క్వార్టర్స్ (సొంతం అంటే కబ్జా అంటారు. ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. ఇంకా స్వాధీనం చేసుకోలేదని సీఎం వివరణ ఇచ్చారు)
ఎంత ఎస్ఎఫ్టీ: 5 వేల చదరపు అడుగులు
శాశ్వత నివాసం ఉందా?: లేదు












Click it and Unblock the Notifications