బెజవాడ బ్రాండ్ ను దెబ్బ తీశారు.. మేమొచ్చాకే ఓ షేప్ : చంద్రబాబు
విజయవాడ : విజయవాడలో చేపడుతోన్న అభివృద్ధి పనుల్లో భాగంగా.. ఇన్నర్ రింగ్ రోడ్డును ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇన్నర్ రింగ్ రోడ్డుతో విజయవాడకు ఓ రూపు తీసుకొచ్చామని స్పష్టం చేసిన ఆయన, గత పాలకులు చేసిన నిర్లక్ష్యంతో విజయవాడ పరిస్థితిని చూస్తే గుండె తరుక్కుపోయిందన్నారు.
ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు విషయానికొస్తే.. రామవరప్పాడు నుంచి నుంచి గొల్లపూడి వరకు 9.84 కిలోమీటర్ల మేర రెండు హైవేలను కలుపుతూ రోడ్డు నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తి కావడంతో బుధవారం సీఎం చంద్రబాబు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డును ప్రారంభించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ఇకనుంచి హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనాలను ఇన్నర్ రింగ్ రోడ్డుకు మళ్లించనున్నారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రారంభం సందర్బంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలకులు విజయవాడ పట్ల చూపించిన నిర్లక్ష్యానికి తన గుండె తరుక్కుపోయిందని,విజయవాడ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీశారని ఆరోపించారు. అందుకే అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నగరానికి ఓ షేప్ తీసుకొస్తున్నామని తెలిపారు. ఊహించని రీతిలో చేపట్టామని, కేవలం 18 నెలల్లోనే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశామని ఈ సందర్బంగా చంద్రబాబు పేర్కొన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రయోజనాల గురించి ప్రస్తావిస్తూ.. ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల ట్రాఫిక్ సమస్య తీరడమే కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయన్నారు. అలాగే పాత విజయవాడ వేరు..అభివృద్ధి చెందుతున్న విజయవాడ వేరని చంద్రబాబు అన్నారు. సీడ్ క్యాపిటల్ కు ఇన్నర్ రింగ్ రోడ్లను అనుసంధానం చేస్తామని తెలిపారు.అలాగే కృష్ణా పుష్కరాల గురించి కూడా ప్రస్తావించిన సీఎం చంద్రబాబు.. పుష్కరాలకు వచ్చే భక్తులను బంధువుల్లా ఆదరించాలని బెజవాడ ప్రజలకు సూచించారు.












Click it and Unblock the Notifications