దాని గురించి మోడీతో మాట్లాడాను: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్నారు. అనకాపల్లి దార్లపూడిలో పోలవరం ఎడమకాలువను పరిశీలించిన చంద్రబాబు అంతకు ముందు దానికి సంబంధించిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు రాష్ట్ర పరిస్థితిపై మోడీతో చర్చ జరిగిన విషయాన్ని ప్రస్తావించారు.
వైసీపీ పాలనపై మండిపడిన చంద్రబాబు
రాష్ట్రం నిలదొక్కుకునేందుకు తన వంతుగా బాధ్యతలు నెరవేరుస్తానని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే సమయంలో గత వైసిపి పాలన పై మండిపడిన చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పాలనతో రాష్ట్రం మొత్తం దివాలా తీసింది అని, రాష్ట్రంలో డబ్బులు లేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ పై చంద్రబాబు వ్యాఖ్యలు
భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరించామని చంద్రబాబు తెలిపారు. ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగిన చంద్రబాబు గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి హయాంలోనే పోలవరం 72% పూర్తి చేసామని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పై చంద్రబాబు
గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీపై విరుచుకుపడ్డారు. కరుడుగట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను దోచుకున్నారని, ప్రజల భూములన్నీ కొట్టేయాలనుకున్నారనని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రైతాంగానికి సాగునీరు అందించడానికి ఏపీ ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉందని పేర్కొన్న చంద్రబాబు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ప్రతి ఎకరాకు నీరందుతుందన్నారు.
నదుల అనుసంధానంపై చంద్రబాబు వ్యాఖ్యలు
ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని దీని ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. టెండర్లు పిలిచి సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని తీసుకురావచ్చు అని చంద్రబాబు పేర్కొన్నారు. అనకాపల్లికి గోదావరి జిల్లాలు తీసుకురావాలని సంకల్పించామని చెప్పి అనకాపల్లి జిల్లాకు సాగునీరు అందిస్తే తన జన్మ సార్ధకమవుతుందన్నారు.
రాష్ట్రాన్ని నాశనం చేశారు
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వంశధార వరకు వెళుతుందని పేర్కొన్న ఆయన రాష్ట్రంలో నీటి సమస్యలను తీర్చాలంటే కరువు లేకుండా చేయాలంటే నదుల అనుసంధానమే మార్గం అన్నారు. గోదావరి, కృష్ణ, వంశధార, పెన్నా నదులను అనుసంధానం చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సాగునీరు అందించి రైతులకు న్యాయం చేయడమే ఎన్డీఏ కూటమి కర్తవ్యం అన్నారు.












Click it and Unblock the Notifications