కాళ్లనొప్పులున్నా కష్టపడ్తున్నా: బాబు, మీడియాకు..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల కోసమే తాను దావోస్ పర్యటనకు వెళ్లినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం చెప్పారు. చంద్రబాబు సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీకి బ్రాండింగ్ కోసమే దావోస్లో పర్యటించానన్నారు. కాళ్ల నొప్పులు తిరగబెడుతున్నా తాను కష్టపడుతున్నానని చెప్పారు. సానుకూల దృక్పథంతో పని చేస్తున్నానన్నారు.
అక్కడ ఏ ఇద్దరు కలిసినా భారత్ గురించే మాట్లాడుకుంటున్నారని చెప్పారు. మన దేశం పట్ల అక్కడ సానుకూల వాతావరణం ఉందన్నారు. స్విస్ పర్యటనలో మొత్తం 35 ఈవెంట్లలో పాల్గొన్నట్టు చెప్పారు. బిల్గేట్స్తోపాటు వాల్మార్ట్, లూలూ, గూగుల్ తదితర సంస్థల ప్రతినిధులను కలిశానన్నారు.
ఐదు అంశాల్లో సహకరిస్తామని వాల్మార్ట్ హామీ ఇచ్చిందని చెప్పారు. మన దగ్గరున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఎక్కడా లేరని, ప్రపంచం మొత్తం భారత్ను ప్రత్యేకంగా చూస్తోందన్నారు. త్వరలో హిందూపురంలో విస్తరణకు సంతూరు మందుకొచ్చినట్టు తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్కు ఇన్ఫోసిస్ సహకరిస్తుందన్నారు. ఈ-గవర్నెన్స్లో విప్రోతో కలిసి జాయింట్ వెంచర్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. మార్చిలో శ్రీసిటీలో పెప్సికో యూనిట్ ఏర్పాడవుతుందని, నేచురల్ ఫుడ్స్తో ఉత్పత్తులు తయారు చేయాలని పెప్సికోను కోరినట్లు చంద్రబాబు చెప్పారు.
మనం ఊహించిన దానికన్నా ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మనవాళ్లలో ఉత్సాహం కనిపిస్తోందని, ప్రపంచానికి మన పైన నమ్మకం ఉందన్నారు. భారత్లోనే పెట్టుబడులు పెట్టాలన్న ధోరణి ప్రపంచ పారిశ్రామికవేత్తల్లో కనిపిస్తోందని చెప్పారు. చైనా కన్న మనవద్దే అభివృద్ధికి ఎక్కువ అనుకూలత ఉందన్నారు. యూపీఏ వల్ల పారిశ్రామికవేత్తలు ఇంతకాలం ఇబ్బంది పడ్డారన్నారు. ల్యాండ్ పూలింగ్ పైన ఇంటింటికి వెళ్లి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మీడియా కూడా సానుకూల వార్తలు రాయాలన్నారు.
త్వరలో ఏపీ గేట్ వే ఆఫ్ ఇండియా అవుతుందన్నారు. దావోస్ సదస్సుకు అమెరికా తర్వాత మన దేశం నుండే ఎక్కువ మంది హాజరయ్యారన్నారు. ఈజ్ ఆఫ్ డూయీలో మన దేశం 143వ స్థానంలో ఉందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడుగుతున్నట్లు చెప్పారు.