కడప సంకల్ప సభ: జనం మధ్యలో లోకేశ్, జగన్లా కాదంటూ వర్ల సెటైర్లు
అమరావతి: వైసీపీ అధినేత వైయస్ జగన్ సొంత జిల్లా కడపలో బుధవారం జరిగిన మహా సంకల్ప సభలో టీడీపీ సీనియర్ నేత, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య ప్రతిపక్ష నేత జగన్పై తనదైన శైలిలో సెటైర్లు సంధించారు. సంకల్ప సభ వేదిక వద్దకు సీఎం చంద్రబాబు నాయుడి కంటే పది నిమిషాలకు ముందుగానే వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వేదికపై కూర్చోకుండా జనం మధ్యలోనే కూర్చుండిపోయారు.

ఈ సందర్భంగా సంకల్ప సభలో మాట్లాడిన వర్ల రామయ్య... లోకేశ్ సింప్లిసిటీపై ప్రశంసలు కురిపించారు. గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడపలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలను సైతం ఇక్కడ ప్రస్తావించారు. అప్పట్లో తండ్రి అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని వేదికపై వైయస్ జగన్ కూర్చున్నారని గుర్తు చేశారు.
సీఎం హోదాలోని తన తండ్రి పక్కన ఐఏఎస్ అధికారికి కేటాయించిన సీట్లో కూర్చున్న వైనాన్ని ప్రస్తావించారు. అయితే సంకల్ప సభకు వచ్చిన నారా లోకేశ్ తన తండ్రి సీఎం హోదాలో ఉన్నా, వేదిక ఎక్కకుండా జనం మధ్యే కూర్చుండిపోయారని ఆయన పేర్కొన్నారు. దీనిని బట్టే ఎవరి నైజం ఏమిటో ఊహించవచ్చని ఈ సందర్భంగా వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

మరోవైపు కడపలో జరిగిన సంకల్ప సభలో సీఎం చంద్రబాబు... ప్రతిపక్ష నేత వైయస్ జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'నేను నిప్పులాంటి మనిషిని. మోడీ.. కేసీఆర్సహా ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం నాకు లేదు' అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మోడీకి, కేసీఆర్కి తాను భయపడుతున్నానని జగన్ మాట్లాడుతున్నాడని, వారికి ఎందుకు భయపడాలని సీఎం ప్రశ్నించారు.
కేసీఆర్ తనకు సహచరుడని, అలాంటి వ్యక్తికి భయపడాల్సిన అవసరం ఏమిటన్నారు. కేసులున్న జగన్ భయపడాలని ఎద్దేవా చేశారు. 'అవినీతికి పాల్పడిన రామలింగరాజు, విజయమాల్యా, అగ్రిగోల్డ్ యజమానులు స్వేచ్ఛగా బయట తిరగగలుగుతున్నారా? లేదు.. జగన్దీ అదే పరిస్థితి. జగన్ 11 కేసుల్లో రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు సీబీఐ రుజువు చేసింది. అలాంటి వ్యక్తి భయపడాలి' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాజకీయ ముసుగులో జగన్ అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ ముసుగును మీరే తొలగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కడప ప్రజలు జగన్ వ్యవహారశైలిని ఆలోచించాలని సూచించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇందిర, పీవీ, వైయస్ లాంటి వారితో పోరాటం చేశానని, అయినా ఏ రోజూ ఎవ్వరినీ అసభ్య పదజాలంతో దూషించలేదన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనపై 25 విచారణలు వేయిస్తే ఏ ఒక్కటీ రుజువు కాలేదన్నారు. తాను నిప్పులాంటి మనిషిని కాబట్టే ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారన్నారు. ఎమ్యెల్యేలను తాను డబ్బులిచ్చి కొంటున్నట్లు జగన్ విమర్శిస్తున్నారని, టీడీపీకి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి కూడా అప్పట్లో టీఆర్ఎస్, టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications