నన్ను రెచ్చగొడితే ఏమవుతుందో అర్థమైందా: బాబు, కాంగ్రెస్తో దోస్తీ, కేసీఆర్ పాలనపై కీలక వ్యాఖ్యలు
ఒంగోలు: నాలుగేళ్లుగా తాము అభివృద్ధి ధ్యేయంగా పని చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. ఆయన ప్రకాశం జిల్లా సభలో మాట్లాడారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా గురించి అడిగితే కేంద్ర ప్రభుత్వం ఐటీ రైడ్స్తో భయపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.
ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టడానికే తాను ఇటీవల రెండుసార్లు దేశ రాజధాని న్యూఢిల్లీకి వెళ్లానని చెప్పారు. తనను రెచ్చగొడితే ఆపడం ఎవరితరం కాదని, ఎవరి వల్లా కాదని చెప్పారు. కోడి కత్తి, రైళ్లు తగులబెట్టడం, అభివృద్ధిని అడ్డుకోవడం ప్రతిపక్షానికి అలవాటు అని చెప్పారు.
మూడున్నర దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్తో కలిశా
భావితరాల కోసం తాను మూడున్నర దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీతో స్నేహానికి సిద్ధమయ్యానని చంద్రబాబు తెలిపారు. బీజేపీని నిలదీసేందుకే కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో కలుస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యపు మూలస్తంభాలను నరేంద్ర మోడీ సర్కారు కూలదోస్తుందని విమర్శించారు. జాతీయస్థాయిలో పదవులపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగానే కొనసాగుతానని చెప్పారు.
కేసీఆర్ పాలించుకోలేకపోతున్నారని కీలక వ్యాఖ్యలు
తాను హైదరాబాదును బంగారుమయం చేసి అప్పగిస్తే, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలించుకోలేకపోతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. దొనకొండను పారిశ్రామిక కేంద్రంగా తయారు చేయంతో పాటు త్వరగా టంగుటూరి ప్రకాశం పంతులు పేరిట జిల్లాలో యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తామని చెప్పారు.
జగన్ మీద దాడిపై చంద్రబాబు మరోసారి
ఇటీవల, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నంలో జరిగిన కత్తి దాడిపై చంద్రబాబు స్పందించారు. జగన్ అభిమానే ఆయనపై దాడి చేస్తే తమపై ఆరోపణలు చేయడం ఏమిటన్నారు. గతంలో విశాఖపట్నానికి వచ్చి జల్లికట్టు డ్రామా చేశారని, తునిలో ఓ రైలును తగులబెట్టారని విమర్శలు గుప్పించారన్నారు. వైసీపీ నేతలు అసెంబ్లీకి రాకుండా, పోరాడలేక పారిపోయారన్నారు.
నన్ను రెచ్చగొడితే ఏమౌతుందో వారికి అర్థమైంది
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ధర్మ పోరాట దీక్ష పేరుతో నిరసనలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. తనను రెచ్చగొడితే ఏమవుతుందో ఇప్పటికే వారికి (కేంద్ర ప్రభుత్వానికి) అర్థమైంది చెప్పారు. కేంద్రం గవర్నర్ వ్యవస్థను భ్రష్టు పట్టించిందన్నారు. ఏపీకి ముఖ్యమంత్రిగా ఉంటూనే నవ్యాంధ్రను ప్రపంచానికి ఓ నమూనాగా, భారత్లో అభివృద్ధికి చిరునామాగా తయారు చేస్తామన్నారు.