రోజా డౌట్..విష్ణు ఔట్ - బాబాయ్ సేఫ్: ఎమ్మెల్యేలకు జోడు పదవులు రద్దు : జగన్ సంచలన నిర్ణయం..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నేతలు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ చివరి దశకు వచ్చింది. ఈ రోజు రాష్ట్ర స్థాయి..జిల్లా స్థాయిలో ఉండే కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీకి నిర్ణయించారు. అందులో భాగంగా..పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు సీనియర్ ఎమ్మెల్యేలకు కొన్ని పోస్టులు అప్పగించారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వారికి అదనంగా జోడు పదవుల్లో కొనసాగకుండా నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగా ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ గా మల్లాది విష్ణుకు అప్పగించారు. అయితే, తాజా పోస్టుల్లో ఏపి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా వైజాగ్ కు చెందిన సీతం రాజు సుధాకర్ ను ఎంపిక చేసారు.
దీంతో పాటుగా ఆయనకు బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ తో పాటు TTD EX అఫీషియో సభ్యుడిగా కూడా హోదా కల్పించారు. దీంతో..విష్ణు పదవి పోయినట్లుగానే భావించాలి. మరి..మంత్రి పదవి దక్కని కారణంగా రోజాకు ఇచ్చిన ఏపీఐఐసీ పదవి ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది. అదే విధంగా కాపు కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉన్న జక్కంపూడి రాజా ను సైతం ఆ పదవి నుండి తప్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, ఈ నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ-ఎస్టీ-బీసీ- మైనార్టీలకు 50 శాతం...మహిళలకు 50 శాతం పదవులు కేటాయిస్తున్నారు. ఇక, బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ గా మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించారు.
ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ..విఎంఆర్ డీఏ చైర్మన్ గా అక్కరమాని విజయనిర్మల ( విశాఖ తూర్పు యోజకవర్గం)., రాష్ట్ర విద్యావిభాగం వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ( విశాఖ పశ్చిమ ), నెడ్ క్యాప్ చైర్మన్ గా కేకే రాజు ( విశాఖ ఉత్తరం ), రాష్ట్రమైనారిటీ విభాగం ఛైర్మన్ జాన్ వెస్లీ ( విశాఖ దక్షిణం ), రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ ఛైర్మన్ గా దాడి రత్నాకర్ ( అనకాపల్లి ), విశాఖ రీజియన్ పెట్రోకారిడార్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ( విశాఖ ఉత్తరం ), స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రముఖ ఆడిటర్ జీవి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా చింతకాయల సన్యాసిపాత్రుడు ( నర్సీపట్నం ), డీసీఎమ్ ఛైర్ పర్సన్ గా పల్లా చినతల్లి ( గాజువాక ) ఎంపిక చేసినట్లుగా సమాచారం.
ఇక, రాష్ట్ర స్థాయిలో కీలకంగా చెప్పుకొనే ఏపీ మైనింగ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా మైనార్టీ వర్గానికి చెందిన షమీం అహ్మద్ కు కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ ఛైర్మన్ గా మహిళా నేతను ఎంపిక చేసారు. కాసేపట్లోనే వీటికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.