జగన్ పాపులారిటీ ఎలా ఉంది : బెస్ట్ సీఎంల్లో ఏ స్థానం: ఇండియా టూడే సర్వే తేల్చిందేంటి..!!
ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టూడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో తాజాగా ఒక సర్వే నిర్వహించింది. ప్రధాని-రాష్ట్రాల ముఖ్యమంత్రుల పని తీరు పైన ఈ సర్వే కొనసాగింది. ప్రజా మూడ్ తెలుసుకొనేందుకు నిరంతరం ఈ సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. అయితే, ఈ సారి చేసిన సర్వేలో ఆసక్తి కర ఫలితాలు వెల్లడయ్యాయి. ఇండియా టూడే చేసిన సర్వేలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దక్కిన స్థానం.. పాపులారిటీలో వారికి గతం కంటే బెటర్ గా ఉన్నారా..మరింతగా తగ్గిందా అనేది రెండు రాష్ట్రాల ప్రజల్లోనూ ఆసక్తికరంగా మారుతోంది.
దేశంలో జగన్ స్థానం ఎంత..
ఇక, జాతీయ స్థాయిలో చేసిన సర్వలోనూ ఇదే రకమైన ఆసక్తి కర ఫలితాలు వచ్చాయి. 151 మంది ఎమ్మెల్యేలతో విజయం సాధించి..ఒక విధంగా టీడీపీ బలహీనంగా ఉందని భావిస్తున్న పరిస్థితుల్లో ఇండియూ టూడే సర్వేలో జగన్ స్థానం పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది. ఇక, ఇదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి కనిపిస్తోంది. సర్వే ఫలితాలను చూస్తే... దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రుల ర్యాకింగ్స్ లో జగన్ స్థానం సంపాదించారు.
బెస్ట్ సీఎంల్లో నాలుగో స్థానంలో జగన్..
జాతీయ స్థాయిలో బెస్ట్ సీఎం గా ఎవరిని ఎంపిక చేస్తారనే ప్రశ్నకు సమాధానంగా.. తొలి స్థానంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాద్ , రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మూడో స్థానంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉండగా..నాలుగో స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిలిచారు. అయిదో స్థానంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్, ఆరో స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఆ తరువాతి స్థానంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నారు. ఇదే రకంగా గత ఏడాది సర్వేలో జగన్ నాలుగో స్థానంలోనే నిలిచారు. ఇప్పుడు తిరిగి ఆ స్థానం నిలబెట్టుకున్నారు.
హామీల అమలుతోనే స్థానం సుస్థిరం..
నవరత్నాల హామీలను రాష్ట్ర ఆర్దిక పరిస్థితి సానుకూలంగా లేక పోయినా..అప్పులు చేసైనా తన మాట నిలబెట్టుకోవటానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా కోవిడ్ విషయంలో జగన్ కు కేంద్రం ప్రశంసలు లభించాయి. ఇక, ఇప్పుడు జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో బెస్ట్ సీఎంగా దేశంలో ఆరో స్థానం దక్కటం పైన వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అనేక పధకాలు అమలు చేస్తూ..రాజకీయంగా ప్రతిపక్షాలకు ఎదిగే అవకాశం లేకుండా చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏడేళ్లుగా తన పాలన అందిస్తున్నారు. గతంలో ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ స్థానం కోసం పోటీ పడ్డారు.కానీ, ఇప్పుడ కేసీఆర్ ప్రస్తావన లేకపోవటం పైన చర్చ జరుగుతోంది.
ప్రధాని మోదీ తొలి స్థానంలో..
జాతీయ రాజకీయాల్లో ప్రధాని మోదీకి పాపులారిటీ సైతం తగ్గినట్లుగా సర్వే చెబుతోంది. గత ఏడాది ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో 66 శాతం పాపులారిటీ మోదీకి రాగా.. ఈ సారి 24 శాతమే కనిపిస్తోంది. అయితే, ఇదే సమయంలో మమతా బెనర్జీకి అనుకూలంగా గతంలో ఉన్న రెండు శాతం..ఇప్పుడు 8 శాతానికి, యోగి పైన మూడు నుంచి 11 శాతానికి పెరగటం కూడా చర్చకు కారణమవుతోంది. ఇక, మోదీ తరువాత ప్రధాని అభ్యర్దిగా అమిత్ షాకు గతం లో ఉన్న సానుకూలత 24 శాతం నుంచి ఇప్పుడు 30 శాతం కు పెరిగింది. అదే విధంగా యోగీకి 19 నుంచి 21 శాతానికి పెరిగింది.
మూడ్ ఆఫ్ ది నేషన్ కోసమే నంటూ..
ఇలా...ఈ సంస్థ ప్రచురించిన మూడ్ ఆఫ్ ది నేషన్ లో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. తాము క్షేత్ర స్థాయిలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని..పనితీరు ఆధారంగానే ప్రజాభిప్రాయం సేకరించామని..వాటికి అనుగుణంగా ఫలితాలు వెల్లడించామని సర్వే సంస్థ చెబుతోంది. ఇప్పుడు, జగన్ పాపులారిటీ-ర్యాంకింగ్స్ పైన సర్వే వెల్లడించిన ఫలితాల పన వైసీపీ నేతలు- ప్రతిపక్ష పార్టీల నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.