ప్రజాదరణ సీఎంలలో జగన్ ర్యాంకు ఎంత - ఏపీలో గెలుపెవరిది : సర్వే తేల్చిందిదే..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రజాదరణ ఏ స్థాయిలో ఉంది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో ఇప్పుడు ఇవే అంశాల పైన ఇండియా టుడే - సీ ఓటర్ సంయుక్త 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేలో ఆసక్తి కర అంశాలు వెల్లడయ్యాయి. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో..ఏపీకి సంబంధించి ఆసక్తి కర సమీకరణాలను బయట పెట్టింది. ఏపీలో మూడేళ్లకు పైగా సాగుతున్న జగన్ పాలన పైన ప్రజాభిప్రాయం పసిగట్టే ప్రయత్నం చేసింది.
దేశ వ్యాప్తంగా అయిదో స్థానంలో సీఎం జగన్
ఈ సర్వేలో ఏపీలో వైసీపీ ఆధిపత్యం కొనసాగుతోందని తేలింది. ముఖ్యమంత్రి జగన్ ప్రజాదరణ విషయంలో నూ క్లారిటీ ఇచ్చింది. ఏపీలో ఎన్నికలు జరిగితే వైసీపీకి 18 లోక్ సభ స్థానాలు దక్కుతాయని సర్వేలో అంచనాకు వచ్చారు. టీడీపీ 7 సీట్లకు పరిమితం కానుంది. ఇక, ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో దేశ వ్యాప్తంగా అయిదో స్థానంలో సీఎం జగన్ నిలిచారు.
దేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో వరుసగా యోగి ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), ఎంకే స్టాలిన్(తమిళనాడు), తరువాతి స్థానంలో జనగ్ ఉన్నారు. అదే విధంగా.. ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగాలని 57 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వే స్పష్టం చేసింది.
57 శాతం ప్రజల మద్దతు
ఏపీలో సంక్షేమాభివృద్ధి పథకాలు, సామాజిక న్యాయాన్ని ప్రజలు ఆదరిస్తున్నట్లుగా సర్వేలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే, ఏపీలో రాజకీయంగా బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ నామమాత్రంగానే ఉన్నట్లుగా పేర్కొన్నారు. జనసేన బలం గురించి ప్రస్తావన లేదు. 2019 ఎన్నికల్లో 50 శాతం ప్రజలు ఏపీలో జగన్ కు మద్దతుగా నిలిచారు.
ఫలితంగా 151 అసెంబ్లీ.. 22 లోక్ సభ స్థానాలు దక్కాయి. ఇప్పుడు ఈ సర్వేలో జగన్ ను సీఎంగా కోరుకుంటున్న వారి సంఖ్య 57 శాతంగా తేల్చారు. ఈ సర్వే ఫలితాలు వైసీపీ శ్రేణుల్లో కొత్త జోష్ ను పెంచుతున్నాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టబోతోందని సర్వేలో తేలింది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గతం కంటే పంజుకుంటుందనే అంశం నిర్దారణ అయింది.
Recommended Video
టీడీపీ కొంత పంజుకున్నా..వైసీపీకే మెజార్టీ
అటు తెలంగాణలో లోక్ సభ స్థానాల వారీగా సర్వేలో బీజేపీకి ఆరు సీట్లు దక్కుతాయని వెల్లడించింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పైన అన్ని వర్గాల ప్రజల్లోనే వ్యతిరేకత పెరిగిందని...ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న సమయంలో ఈ సర్వే ఫలితాలు వైసీపీతో పాటుగా రాజకీయంగానూ చర్చకు కారణమవుతోంది.
కొద్ది రోజుల క్రితం ఇండియా టీవీ నిర్వహించిన సర్వేలో వైసీపీకి 19 లోక్ సభ సీట్లు వస్తాయని పేర్కొనగా.. ఇప్పుడు ఈ సర్వేలో 18 సీట్లు వస్తాయని అంచనాలు వ్యక్తం అయ్యాయి. టీడీపీ కొంత మేర గతం కంటే పంజుకున్నా.. వైసీపీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో.. ఇప్పుడు ఈ సర్వే ఫలితాలు రాజకీయంగా ఏపీలో ఆసక్తి కర చర్చకు కారణమయ్యాయి.