టీడీపీ మైండ్ గేమ్ - ట్రాప్ లో వైసీపీ : అక్కడే జగన్ టీం వైఫల్యం..!!
ఏపీలో అధికార వైసీపీ వర్సస్ ప్రతిపక్ష టీడీపీ మధ్య ఆట మొదలైంది. ప్రజల్లోకి వెళ్లేందుకు రెండు పార్టీలో పోటీ పడుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ప్రత్యర్ధి పార్టీలకు అవకాశం ఇవ్వకుండా రెండు పార్టీలు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ ఇంటింటికీ గడప ప్రకటించగానే..టీడీపీ బాదుడే బాదుడు పేరుతో కార్యక్రమం మొదలు పెట్టింది. టీడీపీ మహానాడు వేళ..ఏపీ మంత్రులతో వైసీపీ సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర ప్రారంభించింది.
టీడీపీ మహానాడు ప్రతీ ఏటా జరిగే పార్టీ కార్యక్రమం. కానీ, అదే సమయంలో మంత్రుల బస్సు యాత్ర ద్వారా మహానాడుకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి. 2019 ఎన్నికల తరువాత నైరాశ్యం లో టీడీపీకి తిరిగి జోష్ నింపేందుకు ముందస్తు ప్రణాళికళతో చంద్రబాబు మహానాడుకు సిద్దమయ్యారు.

టీడీపీ పక్కా మైండ్ గేమ్..
వ్యూహాత్మకంగా ముందు నుంచి ప్రభుత్వం మహానాడుకు ఇబ్బందులు క్రియేట్ చేస్తుందనే ప్రచారం ప్రారంభించారు. కానీ, మంత్రులు ఎక్కడా వాటిని తిప్పి కొట్టలేదు. టీడీపీ నేతల ప్రచారంతో కేడర్ తో మరింత పట్టుదల పెరిగింది. ప్రకాశం జిల్లాతో పాటుగా సరిహద్దు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు మహానాడు సభకు కార్యకర్తలను తరలించటాన్ని టీడీపీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
అందులో సక్సెస్ అయ్యారు. సహజంగా మహానాడు ప్రతీ ఏటా మూడు రోజులు నిర్వహిస్తారు. కానీ, ఈ సారి రెండు రోజులకే కుదించారు. తొలి రోజునే దాదాపు మహానాడు ప్రధాన ఘట్టం ముగిసింది. రెండో రోజు ఎన్టీఆర్ జయంతి కావటంతో..బహిరంగ సభకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ సభ కోసం మహానాడు నిర్వహించారా అనే విధంగా టీడీపీ అధినేత మొదలు పార్టీ నేతలు ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
చంద్రబాబు సైతం అద్దంకిలో ఎన్టీఆర్ కు నివాళి అర్పించే సమయంలోనూ..సాయంత్రం జరిగే సభకు వచ్చే జనం చూడాలంటూ చేసిన వ్యాఖ్యలతోనే సభను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం స్పష్టం అవుతోంది.

సోషల్ మీడియా ప్రచారంతో..
అయితే, మహానాడు జరిగిన రెండు రోజుల పాటుగా బస్సు యాత్ర కంటే టీడీపీ లో ఉత్సాహం పెరిగిందని... వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ ఆ పార్టీ నేతలు ప్రసంగాలు చేసారు. ఆ ప్రసంగాలతో పాటుగా.. సభకు వచ్చిన స్పందన అందరి ఫోకస్ తమ వైపు మళ్లేలా ప్రచారం చేసుకోవటం లో టీడీపీ క్యాంపు సక్సెస్ అయింది.
సోషల్ మీడియాను సక్సెస్ ఫుల్ గా ఉపయోగించుకున్నారు. దీంతో పాటుగా పార్టీలో చేరికలు అంటూ..కొత్త చర్చను తెర మీదకు తీసుకొచ్చి టీడీపీ వైపు చర్చ మళ్లేలా చేసుకోగలిగారు. అదే సమయంలో బస్సు యాత్రకు ప్రచారం కల్పించటంలో.. ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఆ ప్రణాళిక లోపం స్పష్టంగా బయట పడింది.
అందునా.. ఎండాకాలం మధ్నాహ్నం సమయంలో బహిరంగ సభలు ఏర్పాటు చేయటం...సభల కోసం వచ్చిన వారు గంటల తరబడి వేచి చూడటం.. చివరకు ఖాళీ కుర్చీలే మినహా.. జనాలు లేరంటూ టీడీపీ నేతలు..మద్దతు మీడియా ప్రచారానికి అవకాశం ఏర్పడింది.

టార్గెట్ చంద్రబాబు.. యాత్ర లక్ష్యం సైడ్ ట్రాక్
మహానాడు కు వచ్చిన కవరేజ్.. సానుకేల ప్రచారం తమ బస్సు యాత్రకు వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేయటంలో వైసీపీ కోర్ టీం వైఫల్యం కనిపిస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. చంద్రబాబు పార్టీ వేదికగా చేసిన ప్రసంగాల పైన జగన్ ను వ్యక్తిగతంగా.. పాలనా పరంగా టార్గెట్ చేసారు. వాటికి కౌంటర్ గా మంత్రులు జగన్ పాలన..తమ యాత్ర ను ఫోకస్ చేయాల్సిన సమయంలో..టీడీపీ అంతర్గత వ్యవహారాలు - ఎన్టీఆర్ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. కోనసీమ లో విధ్వసం పైన చంద్రబాబు చేసిన విమర్శలకు మంత్రులు ధీటుగా సమాధానం ఇవ్వలేకపోయారంటూ పార్టీలో చర్చ సాగుతోంది.
మహానాడు కు మీడియా దక్కిన ప్రాధాన్యత.. మంత్రుల బస్సు యాత్రకు దక్కలేదు. మహానాడు కోసం చంద్రబాబు అండ్ టీం పక్కాగా ముందు నుంచి ప్రణాళికలతో..పాటుగా మైండ్ గేమ్ తో పై చేయి సాధించినట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి.

అదే అసలు లోపం.. వైసీపీలో చర్చ
కానీ, మంత్రుల బస్సు యాత్రకు సరైన కసరత్తు చేయలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనలో ఉండటం .. మంత్రుల బస్సు యాత్రలో సమన్వయం లోపం.. కొందరు సీనియర్లు సైతం ఇది మంత్రుల కార్యక్రమం అనే విధంగా వ్యవహరిచటంతో మైలేజీ సాధించటంలో వెనుకబడ్డారనే అభిప్రాయం వినిపిస్తోంది.
బస్సు యాత్ర సభల్లో తమ లక్ష్యం వివరించటం కంటే..చంద్రబాబు పైన పోటీ పడి చేసిన వ్యాఖ్యలే వైసీపీ మద్దతు మీడియా సైతం ప్రచారం చేయటంతో.. బస్సు యాత్ర అసలు ఉద్దేశం పక్కకు వెళ్లిపోయిందని పార్టీ అంతర్గత చర్చల్లో వినిపిస్తున్న వాదన. దీంతో.. ఇప్పుడు మహానాడు - మంత్రుల బస్సు యాత్ర లో ఏది సక్సెస్ అయిందనేది పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చకు కారణమైంది.












Click it and Unblock the Notifications