ప్రజాక్షేత్రంలోకి సీఎం జగన్..ముహూర్తం ఫిక్స్..? ఇక నేరుగా ప్రజల నుంచే ఫీడ్బ్యాక్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ ఏర్పాటై ఏడాది ముగిసింది. ఈ ఏడాది కాలంలో ఏపీ సర్కార్ అభివృద్ధికంటే సంక్షేమ పథకాలకే పెద్ద పీట వేసింది. ఎన్నికలకు ముందు వైసీపీ తన మేనిఫెస్టోలో ఉంచిన నవరత్నాలను అధికారంలోకి వచ్చాక దాదాపుగా పూర్తి చేసింది. చెప్పినవీ చెప్పనివీ కూడా జగన్ ప్రభుత్వం చేస్తోంది. ఇక దేశంలో ఎన్నడూ లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు తమ ఇంటికే చేరేలా ప్రణాళిక రూపొందించి సక్సెస్ అయ్యింది. ఇక ఏడాది పాలన సందర్భంగా జగన్ పలు సమీక్ష సమావేశాలు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. తాజాగా సీఎం జగన్ నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని భావించినట్లు సమాచారం. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video
చంద్రబాబుకు మరో షాక్: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి, ఆయన కుమారుడు
ప్రజల ముందుకు సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఏడాది పాలన ముగిసినందున తన పాలనపై ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తన తండ్రి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి అయిన జూలై 8 నుంచే ప్రజల్లోకి వెళ్లాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఏ కార్యక్రమం అయినా సరే వైయస్ జయంతి రోజునే ప్రారంభించే జగన్.... అధికారంలోకి వచ్చాక కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే జూలై 8న ముందుగా రాష్ట్రంలోని 27 లక్షల మంది లబ్ధి దారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి అనంతరం ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సంక్షేమ పథకాలపై ఆరా
సీఎం జగన్ తొలి ఏడాదిలో చేపట్టిన సంక్షేమ పథకాలపై నేరుగా ప్రజలను అడిగి తెలుసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలపై ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులతో సమావేశమై వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇక ప్రజల్లోకి వెళ్లి అభిప్రాయాలు తీసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో రచ్చబండ, ప్రజాదర్బార్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని సమాచారం. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలు, నగదు బదిలీ పథకాలు, వాటి అమలు తీరు , పథకాల ఫలితాలు దక్కాయా లేదా ఇలా పలు అంశాలపై ప్రజల నుంచి రిపోర్ట్ తీసుకోనున్నారు. ఒకవేళ అర్హులై ఉండి కూడా వారికి పథకాల ఫలాలు అందకపోతే వెంటనే వారి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.
గ్రామ సచివాలయాల పనితీరుపై ...
ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలపై కూడా జగన్ ఆరా తీయనున్నారు. వారి పనితీరుపై సైతం ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. ప్రజలకు సంక్షేమ ఫథకాలు నేరుగా తమ ఇళ్లకే చేరాలనే ఉద్దేశంతో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ఇక గ్రామ సచివాలయాలను కూడా ప్రవేశపెట్టిన జగన్.. ఇందుకోసం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీని చేపట్టారు. ఈ క్రమంలోనే వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థల్లో ఏమైనా మార్పులు తీసుకురావాల్సిన అవసరముందా అనేదానిపై కూడా జగన్ చర్చించనున్నారు. రచ్చబండ సమయంలో వ్యవస్థలపై ప్రజల నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.
మొత్తానికి కరోనావైరస్తో బయటకు కాలు అడుగు పెట్టకుండా వ్యవహారాలన్నీ క్యాంపు కార్యాలయం నుంచే నడిపించిన సీఎం జగన్.. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. తన తండ్రి జయంతి రోజునే ఇందుకు ముహూర్తం ఫిక్స్ కావడంతో అటు ప్రజల్లోను ఇటు వైసీపీ కార్యకర్తల్లోను జగన్ పర్యటనపై ఆసక్తి నెలకొంది.