తిండిలేదు.. డబ్బుల్లేవు... కువైట్ లో ఏపీ వాసుల వ్యధ- కేంద్రానికి జగన్ లేఖ...
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా కువైట్ లో ఏపీకి చెందిన వలస కార్మికులు భారీగా చిక్కుకుపోయారు. అధికారుల అంచనా ప్రకారం కువైట్ లో ఏపీకి చెందిన 2500 మంది వలస కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి తినడానికి తిండి లేక, వెనక్కి తిరిగొచ్చేందుకు డబ్బులు లేక నలిగిపోతున్నారు. వీరు ఏపీకి తిరిగి రావాలంటే కనీసం పది వేల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. చమురు పరిశ్రమ డిమాండ్ పడిపోవడంతో ఉపాధి కోల్పోయిన వీరంతా ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు.
కువైట్ లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన 2500 మంది వలస కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇప్పటికే కువైట్ ప్రభుత్వంతో మాట్లాడి వీరి తిరుగు ప్రయాణానికి కావాల్సిన ఖర్చులను భరించేలా ఏర్పాట్లు చేసింది.
అయితే స్ధానికంగా అధికారుల నుంచి విదేశీ ప్రయాణానికి అనుమతించే విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దీంతో విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జై శంకర్ కు సీఎం జగన్ లేఖ రాశారు. కువైట్ లోని భారత హైకమిషన్ తో మాట్లాడి అధికారులతో చర్చలు జరపాలని కోరారు. సాంకేతిక ఇబ్బందులను తొలగించి వారిని క్షేమంగా ఏపీకి పంపేలా చూడాలని జగన్ తన లేఖలో కోరారు.