వైఎస్ జగన్కు అమిత్ షా పిలుపు.. 48 గంటల గ్యాప్లో మళ్లీ ఢిల్లీకి.. వైసీపీ-బీజేపీ మధ్య ఏం జరుగుతోంది?
ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు సంబంధించి ఢిల్లీలో కీలక పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. సీఎం జగన్ కు మరోసారి ఢిల్లీ పెద్దల నుంచి అత్యవసర పిలుపు అందింది. దీంతో ఆయన 48 గంటల వ్యవధిలో రెండో సారి ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రాజధానులు, మండలి రద్దు, చంద్రబాబు మెడకు కేసుల ఉచ్చు, రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు తదితర అంశాల్లో వైసీపీ సర్కారుకు కేంద్రం పక్కాగా హామీ ఇచ్చిందని, అదేసమయంలో కేంద్ర కేబినెట్ లోకి వైసీపీ చేరబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలోనే జగన్ రెండోసారి ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Recommended Video
కేంద్ర హోం మంత్రి పిలుపు..
దాదాపు మూడు నెలల తర్వాత బుధవారం(ఈనెల 12న) ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోదీతో సుదీర్ఘంగా గంటా నలభైనిమిషాల పాటు చర్చలు జరపడం, సీఎం చెప్పిన అన్ని అంశాలకూ కేంద్రం సానుకూలంగా స్పందించిందని వైసీపీ నేతలు ప్రకటించడం తెలిసిందే. నిజానికి జగన్.. బుధవారమే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలవాల్సి ఉన్నా.. పెద్దాయన ఢిల్లీ ఫలితాలపై సమీక్షలో బిజీగా ఉండటంతో విజయవాడకు వెనుదిరిగారు. అపాయింట్మెంట్ను రీషెడ్యూల్ చేసిన కేంద్ర హోం శాఖ.. గురువారం సీఎం జగన్ కు కబురు పంపింది.
రేపు సాయంత్రం 6 గంటలకు..
ఏపీ సీఎం జగన్ శుక్రవారం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకోనున్నారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు కేంద్ర హోం శాఖ ఆమోదం తప్పనిసరికావడంతో భేటీలో అదే విషయం ప్రధానం కానున్నట్లు తెలిసింది. దాంతోపాటు మండలి రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం, ఏపీకి ప్రత్యేక హోదా, పెండింగ్ నిధుల విడుదల, సీబీఐ కేసుల విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అంశాలను కూడా జగన్ ప్రస్తావిస్తారని సమాచారం. ఇక రాజకీయాల విషయానికొస్తే..
చంద్రబాబుపై సీబీఐ ఎంక్వైరీ..
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీతోపాటు కేంద్ర సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరుపుతోన్న నేపథ్యంలో అక్రమాలకు సూత్రధారి చంద్రబాబేనని, ఆయనపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలని వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లోనూ డిమాండ్ చేశారు. అమిత్ షాతో భేటీలో సీఎం జగన్ ఈ అంశాన్ని కూడా లేవనెత్తుతారని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఏపీలో టీడీపీని దెబ్బతీస్తూ వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటోన్న బీజేపీ ఈ అవకాశాన్ని వాడుకుంటుందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
కేంద్ర కేబినెట్ లోకి వైసీపీ?
ఏపీలో వైసీపీ ప్రత్యామ్నాయంగా ఉండాలనుకుంటోన్న బీజేపీ.. కేంద్రంలోకి జగన్ ఎంపీలను ఎలా ఆహ్వానిస్తుందనే చర్చ చాలాకాలంగా నడుస్తున్నదే. అయితే బీజేపీ తరహా రాజకీయాల గురించి అవగాహన ఉన్నవాళ్లు మాత్రం ఇది సాధ్యమనే వాదిస్తున్నారు. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ ఏదైనా రాష్ట్రంలో ఒక పార్టీతో పొత్తు లేదా కలిసి పనిచేయడానికి కామన్ మినిమమ్ ప్రోగ్రాం(సీఎంపీ) లాంటిదేదీ అనుసరించదు. ఇప్పటిదాకా ఎన్డీఏ కూటమికి కూడా సీఎంపీ లేకపోవడం వల్లే రాజకీయ అంశాల్లో మిత్రపార్టీలు తమకు నచ్చిన వైఖరిని అనుసరిస్తూ వచ్చాయి. బీజేపీతో జేడీయూ పొత్తు బీహార్ వరకే పరిమితమై, మిగతా రాష్ట్రాల్లో ప్రత్యర్థుల్లా తలపడటం చూస్తున్నదే. అదే తరహారో ఒకవేళ వైసీపీ గనుక కేంద్ర కేబినెట్ లో చేరితే ఆ పొత్తు ఢిల్లీ వరకే పరిమితమవుతుందని, కామన్ మినిమమ్ ప్రోగ్రాం లేదు కాబట్టి రాష్ట్ర పరిధిలో వైసీపీ, బీజేపీలు ప్రథ్యర్థుల్లాగే తలపడుతాయనే వాదన కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు రెండు పార్టీల వర్గాలు అభిప్రాయపడ్డాయి.
ఉగాది పండక్కి అతిథిగా మోదీ..
వైసీపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పథకంలోని ‘పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమాన్ని మార్చి 25న ప్రారంభించబోతున్నది. అదే రోజు ఉగాది పండుగ కూడా. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కోరారు. అందుకు మోదీ కూడా సానుకూలంగా స్పందించినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే దీకిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.