కొత్త పథకం... 'జగనన్న దూకుడు!!'
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పంథాను పూర్తిగా మార్చేశారు. రెండోసారి కచ్చితంగా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఉన్న ఆయన పార్టీ శ్రేణులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. అధికారమే తప్ప రెండో ఆప్షన్ లేదని నాయకులకు, కార్యకర్తలకు తేల్చేశారు. ఎమ్మెల్యేలుగా మంచిపేరు తెచ్చుకుంటేనే పార్టీ అధికారంలోకి రాగలుగుతుందని, అవసరమైతే పనితీరు సరిలేని ఎమ్మెల్యేలను మారుస్తానని ఖరాఖండిగా తేల్చేశారు.
వ్యూహాత్మకంగా వ్యవహరించిన జగన్
తన వ్యూహంలో భాగంగా పదవుల పంపకానికి సంబంధించి ఎన్నడూ లేనిది ఈ మధ్యకాలంలో దూకుడు పెంచేశారు. అధికారంలోకి వచ్చిన మూడున్నర సంవత్సరాల్లో ఇంత దూకుడు చూడలేదని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయంటే ఈ విషయంలో జగన్ ఎంత వేగంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి, జగన్ కు విధేయులుగా ఉండేవారిని దూరం పెట్టారని, వారికి న్యాయం చేయడంలేదంటూ విమర్శలు వచ్చాయి.
వాటికి చెక్ పెట్టేలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీని నియమించిన సంగతి తెలిసిందే. అలీ జనసేనవైపు చూస్తున్నారని, రేపో, మాపో పార్టీ మారడం ఖాయమంటూ వార్తలు రావడంతో జగన్ వెంటనే స్పందించి వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
జగన్ తరఫున పోసాని వకల్తా
మొదటి నుంచి జగన్ కు విధేయుడిగా ఉంటూ వస్తోన్న పోసాని కృష్ణమురళిని ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. సినీ పరిశ్రమలో ఎటువంటి మద్దతు లేని సమయంలో పోసోని జగన్ తరఫున వకల్తా పుచ్చుకునేవారు. అవసరమైన ప్రతి సందర్భంలో వైరివర్గంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు.
పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడటంద్వారా సినిమాల్లో అవకాశాలను కూడా పోగొట్టుకున్నారు. పోసాని నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నియామకంద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జగన్ తరఫున వాదనలు వినిపించే మరో ప్రముఖుడికి కీలక పదవి లభించినట్లైంది.
త్వరలోనే మరికొన్ని నియామకాలు?
జగన్ దూకుడును చూస్తే రానున్న రోజుల్లో మరికొన్ని నియామకాల్ని చేపట్టబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికలకు ఏడాదిన్నర సమయమే ఉండటంతో ప్రాధాన్యత కలిగిన పదవులన్నింటినీ నియామకాలను పూర్తిచేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావును నియమించారు. సాక్షిటీవీలో పనిచేస్తున్న కొమ్మినేని కేఎస్ఆర్ లైవ్ షో నిర్వహిస్తున్నారు.
జగన్ దూకుడు చూస్తే.. రానున్న రోజుల్లో మరికొన్ని నియామకాల్ని కచ్ఛితంగా చేపడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పదవీ కాలం మరో ఏడాదిన్నర మాత్రమే ఉండటం.. ఎన్నికల వేళ.. మరింత మందిని తన సైన్యంగా మార్చుకునేందుకు వీలుగా పూర్తిస్థాయిలో నియామకాలపై దృష్టిపెట్టారు.