ఏం తమాషాలు చేస్తున్నారా ఏంటి??.. జగన్, చంద్రబాబు ఉగ్రరూపం!
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ వాతావరణం మాత్రం ఏ క్షణంలో ఎన్నికలు జరుగుతాయా? అన్నట్లుగా మారిపోయింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలను జడివానలా కురిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ సీఎం వైఎస్ జగన్ ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా కదులుతున్నారు. జిల్లాల పర్యటనలు జరుపుతూ పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు.

పార్టీలోని లోపాలను సరిచేస్తున్నారు!
రెండోసారి అధికారంలోకి రావడం అనేది వైసీపీ, టీడీపీకి అత్యంత కీలకమైన విషయంగా మారింది. రెండు పార్టీలకు తప్పనిసరి అయ్యింది. దీంతో ఇద్దరు నేతలు ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కుప్పంలో కూడా చంద్రబాబును ఓడించాలని జగన్ ప్రయత్నిస్తోంటే, కడప జిల్లా మొత్తం గెలుచుకుంటామంటూ టీడీపీ ధీమాను ప్రదర్శిస్తోంది. అధికారంలోకి రావాలంటే ముందుగా ప్రత్యర్థుల లోపాలకన్నా తమలోని లోపాలను సరిచేసుకోవాలని జగన్, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

జగన్ కు రక్షణ కల్పించలేకపోతున్న మంత్రులు!
ప్రత్యర్థుల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో జగన్ కు రక్షణగా నిలవాల్సిన క్యాబినెట్ మంత్రులు విఫలమవుతున్నారు. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై కూడా టీడీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వీటిని గట్టిగా తిప్పకొట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని, అలాంటప్పుడు క్యాబినెట్ మంత్రులుగా ఉండి ఉపయోగమేంటని జగన్ గట్టిగా నిలదీసినట్లు తెలుస్తోంది.
ప్రత్యర్థులు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని వారికి గట్టిగా కౌంటర్ ఇవ్వాలికదా ఎందుకివ్వడంలేదని మంత్రులను ప్రశ్నించినట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితమే ఆయన ఎమ్మెల్యేలను గట్టిగా హెచ్చరించి వదిలిపెట్టారు. పనితీరు మారకపోతే సీటిచ్చేది లేదని తేల్చేశారు.

ఎన్నిసార్లు ప్రయత్నించినా వారు మారరు!
విజయవాడలో టీడీపీ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై అధికార పార్టీ నాయకులు దాడిచేసినప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు స్పందించలేదు. దీనిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇలాగే ఉంటే పార్టీ సహించదని, సీనియర్లైనా బయటకు పంపించేస్తానంటూ గట్టిగా హెచ్చరించారు.
టీడీపీ నేతలకు క్లాస్ పీకడం అనేది చంద్రబాబుకు అలవాటలా మారిపోయిందని, ఆయన ఎంత ప్రయత్నించినా వారు మారరని, ఆయన ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో తెలియడంలేదని పార్టీ కార్యకర్తలంటున్నారు.
ఏదేమైనప్పటికీ ఇరు పార్టీల అధినేతలు తమ సొంత నేతలకు మాత్రం గట్టిగా హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఎంతటి సీనియర్ నేతైనా సరే.. పార్టీనే ముఖ్యం అంటున్నారు. ఈ రెండు పార్టీల్లో ఎవరు అధికారం చేజక్కించుకుంటారనేది తెలుసుకోవాలంటే ఎన్నికలు జరిగేవరకు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications