అనూహ్యం: జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా - కారణం ఇదే -ఎంపీ రఘురామ మరో లీగల్ అస్త్రం
కరోనా పరిస్థితుల నిర్వహణలో మోదీ సర్కారు విఫలమైందని బీజేపీయేతర ముఖ్యమంత్రులంతా విమర్శిస్తున్నా, ఆ వాదనను తోసిపుచ్చుతూ, కేంద్రానికి అండగా ఉందామని పిలుపునిచ్చి ప్రత్యేకతను చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్. అంతలోనే, వ్యాక్సిన్ల కొరతపై కేంద్రాన్ని కడిగేస్తూ, రాష్ట్రాలు ఏకం కావాలని లేఖల ద్వారా సీఎంలకు పిలుపునిచ్చిన ఆయన సడెన్ గా ఢిల్లీ టూర్ ప్రకటించారు. పోలవరం, రఘురామ వివాదం సహా పలు అంశాలపై కేంద్రం పెద్దలతో మాట్లాడేందుకు ఇంకొద్ది గంటల్లో ఏపీ సీఎం ఢిల్లీకి బయలుదేరనుండగా..

జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వాయిదాపడింది. పోలవరం ప్రాజెక్టు, విభజన సమస్యలు, వ్యాక్సిన్ల కొరత తదితర అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ సోమవారం ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలవాలని భావించారు. ఇందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. వైసీపీ ఎంపీ రఘురామ ఉదంతంపైనా చర్చిస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఆయన పర్యటన వాయిదా పడింది.

వాయిదాకు కారణం ఇదే..
కరోనా పరిస్థితులపై సమీక్షా సమావేశాలు, సీఏఏ అమలు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం తదితర అంశాల్లో కేంద్ర మంత్రులు బిజీగా ఉండటంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ అనుకున్న సమయానికి అపాయింట్మెంట్లు దొరకరని కారణంగానే పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి కచ్చితమైన అపాయింట్మెంట్లతో సీఎం జగన్ గురువారం ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయని సమాచారం. వ్యాక్సిన్ల కొరతపై అన్ని రాష్ట్రాల సీఎంలకు జగన్ లేఖలు రాయగా, అందులో సంధించిన ప్రశ్నలను ప్రధాని మోదీని ఎందుకు అడగడంలేదంటూ విపక్ష కాంగ్రెస్ తప్పుపట్టడం తెలిసిందే. ఇదిలా ఉంటే,

జగన్ మీడియాకు రఘురామ నోటీసులు
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు ఉదంతంలో అటు సుప్రీంకోర్టు, ఇటు విపక్షాలు ఏపీ సర్కారు తీరును తప్పుపడుతోన్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటనలో రఘురామ ఇష్యూ కూడా చర్చకు వస్తుందని తెలుస్తోంది. సీఎం ఢిల్లీకి వెళ్ళనున్న సందర్భంలోనే రెబల్ ఎంపీ రఘురామ.. జగన్ నెలకొల్పిన సాక్షి మీడియాపై న్యాయపోరాటానికి దిగారు. సాక్షి మీడియాకు ఎంపీ రఘురామ లీగల్ నోటీస్ పంపారు. తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేసినందుకు... బేషరతుగా క్షమాపణ చెప్పాలని, సాక్షి కథనాలతో ప్రతిష్ఠకు భంగం కలిగిందని, వారంలోగా సమాధానం ఇవ్వకుంటే చట్టపరంగా ముందుకెళ్తానని రఘురామ నోటీసుల్లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications