ఆరోగ్య శ్రీలో పెను మార్పులు: ఇకపై వ్యక్తికో కార్డు -కొవిడ్, వ్యాక్సిన్లపై సీఎం జగన్ ఆదేశాలివే -ఆమెకు శభాష్
కరోనా విలయం కాలంలో పేదలకు భారీ ఊతంగా నిలిచిన ఆరోగ్య శ్రీ పథకం అమలులో పెను మార్పులు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొత్త గతిలో ఊపందుకోనుంది. ఆక్సిజన్ కొరత వల్ల మరణాలు సంభవించినట్లు అంగీకరించిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్న కేంద్రం ప్రకటన తర్వాత మహమ్మారి కట్టడికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్య శ్రీ కార్డుల్లో మార్పుల సందర్భంలోనే, చిత్తూరు జిల్లాకు చెందిన ఓ డిజిటల్ అసిస్టెంట్ కేవలం 10 నిమిషాల్లో లబ్దిదారులకు ఆరోగ్య శ్రీ కార్డు అందించడం చర్చనీయాంశమైంది. వివరాలివి..

కొవిడ్ పరిస్థితిపై సీఎం సమీక్ష
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ ప్రక్రియలో అవలంభించాల్సిన విధానాలు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న డిజిటల్ హెల్త్ అంశంపైనా కీలక ఆదేశాలిచ్చారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇలా
టీచర్లు సహా, స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. గ్రామాలు యూనిట్గా పరిగణలోకి తీసుకుని వ్యాక్సినేషన్ ఇవ్వాలని తెలిపారు. దీనివల్ల క్రమబద్ధంగా, ప్రాధాన్యత పరంగా వ్యాక్సినేషన్ ఇచ్చినట్టు అవుతుందని, తద్వారా వ్యాక్సిన్లు వృధా కాకుండా మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్యనున్న వారికి కూడా వ్యాక్సిన్లు ఇవ్వాలి కాబట్టి దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎక్కువ ప్రజా బాహుళ్యంతో సంబంధాలు ఉన్నవారు, ఉద్యోగులు, సిబ్బందికి అధిక ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఆలోచనలు చేయాలని ఆయన చెప్పారు. అలాగే,

డిజిటల్ హెల్త్పై సీఎం ఇలా..
కరోనా మహమ్మారిపై సమీక్షతోపాటే ఏపీలో డిజిటల్ హెల్త్పైనా సీఎం సమాలోచనలు చేశారు. ఆరోగ్యశ్రీ కార్డులో కుటుంబసభ్యుల ఆరోగ్య వివరాలు క్యూఆర్ కోడ్ రూపంలో అందుబాటులో ఉండాలని సీఎం చెప్పారు. విలేజ్ క్లీనిక్స్లో కూడా డేటా వివరాల నమోదుతో పాటు ప్రతి విలేజ్, వార్డు క్లీనిక్స్లో కూడా కంప్యూటర్ ఉండాలని అధికారులను ఆదేశించారు. విలేజ్ క్లీనిక్స్లో సాధారణ పరీక్షలు చేసే పరిస్థితి రావాలని, షుగర్, బీపీ, బ్లడ్ గ్రూప్ సహా ఇతర వివరాలు కార్డులో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మరో ముఖ్యమైన అంశంగా..

ఇకపై వ్యక్తులకూ ఆరోగ్య శ్రీ కార్డు
వైఎస్సార్ ఆరోగ్య శ్రీకి సంబంధించి రాబోయే రోజుల్లో పెను మార్పులు తీసుకొద్దామని సీఎం జగన్ అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగా, కుటుంబానికి ఒక కార్డు కాకుండా విడివిడిగా వ్యక్తుల పేరుపై ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చే దిశగా కార్యాచరణ రూపొందించాలని సీఎం చెప్పారు. ఆరోగ్యశ్రీ, ఆధార్ నెంబర్ చెప్పినా వెంటనే ఆరోగ్య వివరాలు వచ్చే విధానం తీసుకురావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇక,

ఉద్యోగాలను భర్తీ చేయండి..
తల్లీ పిల్లల ఆరోగ్యంపై విలేజ్ క్లీనిక్స్ పై, గ్రామాల్లో కాలుష్య నియంత్రణపై కూడా అధికారులు దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. గ్రామాల్లో తాగునీటి ట్యాంకుల పరిస్థితులపై పర్యవేక్షణ చేయాలని, ఈ క్రమంలోనే విలేజ్ క్లీనిక్స్ నుంచి టీచింగ్ ఆస్పత్రుల్లో రిక్రూట్మెంట్పై దృష్టిపెట్టాలని సీఎం పేర్కొన్నారు. జిల్లాను యూనిట్గా తీసుకుని రిక్రూట్మెంట్ చేయాలని, మూడు నెలల్లో సిబ్బంది భర్తీ ప్రక్రియ పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పీహెచ్సీ నుంచి పైస్థాయి ఆస్పత్రులకు కూడా కాంపౌండ్వాల్ ఉండాలని తెలిపారు. కాగా,

ఆ పని చేసిన తొలి రాష్ట్రం ఏపీ
ఏపీలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టిన సందర్భంలోనే, రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వెల్లడించిన ఓ కీలక అంశం వైరలైంది. ఆక్సిజన్ కొరత కారణంగా కొందరు చనిపోయారంటూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చిందని, ఈ మేరకు ఒక నివేదిక అందిందని, తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా కొద్ది నెలల క్రితం పలువురు చనిపోయిన విషయాన్ని కేంద్రానికి ఏపీ సర్కార్ తెలిపిందని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి పవార్ ప్రకటించారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాదానంగా మంత్రి వివరణ ఇచ్చారు. దాంతో ఆక్సిజన్ కొరత మరణాలను అంగీకరించిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ప్రాణవాయువు అందక దేశంలో పలు రాష్ట్రాల్లో ఇదే తరహా ఘటనలు జరిగాయి. అయితే ఆక్సిజన్ కొరతవల్ల మరణాలు సంభవించినట్లు రాష్ట్రాలు తమ దృష్టికి తీసుకురాలేదంటూ ఇటీవలే కేంద్రం వెల్లడించడం తెలిసిందే. ఇదిలా ఉంటే,

10 నిమిషాల్లోనే ఆరోగ్య శ్రీ కార్డు..
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కార్డుల జారీలో పెను మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించిన సమయంలోనే, చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటన చర్చలోకి వచ్చింది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం, కురబలకోట మండలం, ఎర్రబల్లె గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ మానస.. తన పరిధిలోని సింగన్నగారిపల్లెకు చెందిన లబ్దిదారులకు కేవలం 10 నిమిషాల్లో ఆరోగ్య శ్రీ కార్డును అందించి అందరిచేతా శభాష్ అనిపించుకున్నారు. సింగన్నవారి పల్లెకు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి తన కుమారుడు యశ్వంత్ (4)కు బోన్ కేన్సర్ చికిత్స కోసం బెంగళూరుకు వెళ్లారు. ఆరోగ్యశ్రీ కార్డు లేదని వైద్యం దొరకని స్థితిలో స్థానిక సర్పంచ్ ఉప్పతి నాగరత్న ఈశ్వర్ చొరవతో డిజిటల్ అసిస్టెంట్ మానస 10 నిమిషాల్లోనే చిన్నవారి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి.. పది నిమిషాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డును చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications