రూటు మార్చిన జగన్: ఆ కీలకాంశంపై మోడీకి మరో లెటర్: రూ.34,109 కోట్లు..లక్ష్యం నెరవేరట్లేదు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వరుస లేఖలు రాస్తోన్నారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభమైన తరువాత.. అదే అంశాన్ని కేంద్రబిందువుగా చేసుకుని పలుమార్లు లేఖలు రాశారు. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం, టీకాల లభ్యత.. వంటి కోవిడ్19 సంబంధిత పరిస్థితులపై తరచూ లేఖలు రాస్తూ వచ్చారాయన. తాజాగా మరో లెటర్ రాశారు. ఈ సారి రూటు మార్చారు. కరోనాకు బదులుగా మరో అంశాన్ని వైఎస్ జగన్ తన లేఖలో ప్రస్తావించారు.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం: నైరుతికి తోడుగా..తుఫాన్గా
కనీస వసతుల కల్పన కోసం..
ఈ సారి వైఎస్ జగన్.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) అంశాన్ని ప్రస్తావించారు. ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పేదల కోసం గృహాలను నిర్మిస్తున్నాయని, దీనికోసం భారీగా భూసేకరణ కొనసాగుతోందని గుర్తు చేశారు. ఇంతా చేసినప్పటికీ- కనీస వసతులను కల్పించడానికి అవసరమైన మార్గదర్శకాలను సకాలంలో రూపొందించడం, నిధులను విడుదల చేయడంలో జాప్యం చోటు చేసుకుంటోందని పేర్కొన్నారు. ఫలితంగా- పేదల కోసం నిర్మించిన గ్రీన్ఫీల్డ్ కాలనీ లక్ష్యం నెరవేరట్లేదని చెప్పారు.
రెండు శాఖల మధ్య సమన్వయం
పేదల కోసం నిర్మించే గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో కనీస వసతులను కల్పించే విషయంలో గృహాలు పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయం కనిపించట్లేదని పేర్కొన్నారు. ఈ రెండు శాఖలను అనుసంధానిస్తూ గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఉమ్మడి మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని వైఎస్ జగన్.. ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనితోపాటు- పీఎంఏవై కింద సకాలంలో రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సకాలంలో నిధులు విడుదల కాకపోవడం వల్ల..
సకాలంలో నిధులు విడుదల కాకపోవడం వల్ల ఆయా గ్రీన్ఫీల్డ్ కాలనీలను నిర్మించడానికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలే సమకూర్చుకుంటున్నాయని, ఇన్ని వేల కోట్ల రూపాయలను సొంతంగా, సొంత వనరుల ద్వారా సేకరించుకోవడం కష్టసాధ్యమౌతోందని వైఎస్ జగన్ తన లేఖలో స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణం పూర్తయి..అందులో చేరడానికి లబ్దిదారులు సిద్ధంగా ఉన్నప్పటికీ.. గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలను కూడా సకాలంలో కల్పించలేకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయనేది ఊహించుకోవాలని కోరారు. వేల కోట్ల రూపాయలు వృధా అవుతాయని చెప్పారు.
రూ.34,109 కోట్లు..
ఒక్క ఏపీలోనే గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి 34,109 కోట్ల రూపాయలు అవసరమౌతాయని వైఎస్ జగన్.. ప్రధానికి వివరించారు. ఈ విషయంలో ఇప్పటికే తాము 23,535 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆ నిధులను కేంద్ర ప్రభుత్వమే విడుదల చేయాల్సి ఉందని గుర్తు చేశారు. పేదల కోసం గృహాలను నిర్మించినప్పటికీ.. కాలనీల్లో సకాలంలో కనీస మౌలిక వసతులను కల్పించలేకపోవడం వల్ల లక్ష్యం నెరవేరట్లేదని చెప్పారు. నిధులను సకాలంలో విడుదల చేయడం, గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో మౌలిక వసతులను కల్పించే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.