27న ఏపీ సీఎం వైఎస్ జగన్ పార్టీ నేతలతో కీలక భేటీ: వచ్చే ఎన్నికలే లక్ష్యంగా దిశానిర్దేశం
అమరావతి: అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పట్నుంచే సిద్ధమవుతున్నాయి. ఇటీవల ప్రతిపక్ష పార్టీ నుంచి సవాళ్లు ఎదురవుతుండటంతో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తమైంది. రానున్న సాధారణ ఎన్నికలకు పార్టీ నేతలను సిద్ధం చేయడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పట్నుంచే దృష్టిసారించారు.

27న పార్టీ నేతలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక భేటీ
ఇటీవల మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు, జిల్లాల పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మాజీ మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఏప్రిల్ 27న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కీలక భేటీ జరగనుంది.

వచ్చే ఎన్నికల లక్ష్యంగా జగన్ దిశానిర్దేశం
ఏప్రిల్ 27న మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం జగన్ నేతృత్వంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో పార్టీ పటిష్టత, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రులు, పార్టీ అధ్యక్షులను సఖ్యతగా ఉంచడం, తద్వారా పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానేనా?
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం చాలానే ఉంది. అయితే, ఏపీ రాజకీయాలు మాత్రం వాడివేడిగానే సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏపీలో మళ్లీ అధికారమే దిశగా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఒంటరిగానే పోటీ చేస్తుందా ? లేదా ఇతర పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా ? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే.. త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని భావిస్తున్న ప్రశాంత్ కిశోర్.. ఆ పార్టీ అధిష్టానానికి ఓ నివేదిక ఇచ్చినట్లు.. అందులో ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని సూచించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పొత్తులపై వైసీపీ నేతలు విభిన్నంగా స్పందించారు. భూస్థాపితమైన పార్టీతో పొత్తు ఉండదని, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డినే అని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఎన్నికల సమయం వరకు ఏయే పార్టీలు ఏ పార్టీలతో కలిసి పోటీ చేస్తాయనేది తేలే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications