ప్రధాని మోడీతో గంటకుపైగా సీఎం జగన్ భేటీ, కీలకాంశాలపై చర్చ, కేంద్రమంత్రులతోనూ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిప్రధాని నరేంద్ర మోడీతో గంటకుపైగా సమావేశం అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లిన జగన్.. సాయంత్రం చేరుకున్నారు. అనంతరం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై ప్రధానితో సీఎం జగన్ చర్చించారు. వివిధ అంశాలపై ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు.

ప్రధాని మోడీతో సీఎం జగన్ కీలక భేటీ
పోలవరం, కడప స్టీల్ప్లాంట్, ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధతపై ప్రధానికి నివేదించారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిలపైనా ప్రధానితో చర్చిచారు. సీఎం జగన్ నివేదించిన అంశాలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు సీఎం జగన్.

ప్రధాని మోడీకి సీఎం జగన్ వినతులు
2019, ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55, 548.87 కోట్లుగా నిర్ధారించింది. ఈ అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఇందులో నిర్మాణ పనులకోసం రూ.8,590 కోట్లు, భూ సేకరణ పునరావాసంకోసం రూ.22,598 కోట్లు ఖర్చవుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వైజ్గా బిల్లుల చెల్లింపును సవరించాలని కోరుతున్నాం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు, కేంద్ర చెల్లిస్తున్న బిల్లులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. ఈ ఆంక్షల వల్ల రూ.905 కోట్ల బిల్లులను కూడా పోలవరం ప్రాజెక్ట్అథారిటీ తిరస్కరించింది. కాంపొనెంట్వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టులో జరిగే పనులను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాను. అంతేకాకుండా నిధులను సకాలానికే విడుదలచేయాలని ప్రధాని మోడీని ఏపీ సీఎం జగన్ కోరారు.

నిర్మలా సీతారామన్తో సీఎం జగన్ సమావేశం
ప్రధానితో భేటీ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సీఎం జగన్ సమావేశమయ్యారు. రెవెన్యూ లోటు భర్తీకి ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉందని నిర్మలా దృష్టికి తీసుకొచ్చారు. పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని కోరారు. వివిధ కార్యక్రమాలకు ఖర్చు చేసిన రూ.32,625 కోట్లు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రుణ పరిమితుల్లో కోత విధించడం సరికాదని విజ్ఞప్తి చేశారు. పోలవరం నిధులివ్వాలని, సవరించిన అంచనాలు ఆమోదించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.

జలశక్తి మంత్రితో సీఎం జగన్ భేటీ..
ఆ తర్వాత జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సీఎం జగన్ 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. భేటీలో పోలవరం ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చించారు. ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తయ్యేలా సహకారం అందించాలని, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అంచనాలను వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. కాంపొనెంట్ వారీ కాకుండా మొత్తం పనులకు బిల్లులు చెల్లించాలని విన్నవించారు. వరదలకు దెబ్బతిన్న ఎర్త్ కం రాక్ఫిల్ డ్యామ్ పునాదులపై భేటీలో చర్చించారు. డయాఫ్రం వాల్పై నిపుణులతో చర్చలు జరుపుతున్నామన్న షెకావత్.. వారం, పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్కు తెలిపారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీని వెంటనే నిర్వాసితులకు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం జగన్ కేంద్రమంత్రిని కోరారు.

హోంమంత్రి అమిత్ షాను కలిసిన సీఎం జగన్
షెకావత్తో భేటీ అనంతరం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై అమిత్ షాతో అరగంటపాటు చర్చించారు. బుధవారం ఉదయం 9.15 గం.కు కేంద్రమంత్రి గడ్కరీతోనూ సీఎం జగన్ సమావేశం కానున్నారు. గడ్కరీతో భేటీ తర్వాత అమరావతికి బయలుదేరి రానున్నారు.












Click it and Unblock the Notifications