పింగళికి భారత రత్న ఇవ్వండి- ఇదే మంచి సందర్భం- ప్రధాని మోడీకి జగన్ లేఖ
భారతదేశం స్వాతంత్రం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ జెండా రూపకర్త అయిన తెలుగువాడు పింగళి వెంకయ్యకు భారత రత్న పురస్కారం ప్రకటించాలని ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మోడీకి ఓ లేఖ రాశారు.
స్వాతంత్రానికి 75 ఏళ్లు పూర్తయిన వేళ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏపీలోని ఐదు కోట్ల మంది ప్రజలకు సంతోషాన్నిస్తోందని సీఎం జగన్ ప్రధాని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. గత ఏడు దశాబ్దాల్లో ఎన్నో కష్టనష్టాలకోర్చి పురోగమిస్తున్న మన దేశం ఇలాంటి సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం ఉందని జగన్ తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్రోత్సవాల సందర్భంగా ఈ ఆగస్టు 15న ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరేయాలని కేంద్రం పిలుపునివ్వడం ముదావహమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని జగన్ తెలిపారు. గాంధీయవాద ఆలోచనలతో స్వాతంత్రోద్యమంలో పాల్గొని తన జీవితం మొత్తాన్ని జాతి సేవకే అర్పించిన ఘన చరిత్ర పింగళి వెంకయ్యకు ఉందన్నారు. 1916లో వివిధ దేశాల జాతీయ పతాకాలను పరిశీలించి శాస్త్రీయ విధానంలో మన జెండాకు పింగళి రూపకల్పన చేశారని జగన్ తెలిపారు.

1921లో గాంధీ విజయవాడ వచ్చినప్పుడు తాను తయారు చేసిన జాతీయ పతాకాన్ని పింగళి ఆయనకు ఇచ్చారని ప్రధాని మోడీకి గుర్తుచేశారు. కాబట్టి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత రత్న పురస్కారం ప్రకటించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. గతంలో భూపేన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్, అరుణా అసఫ్ అలీ, జయప్రకాష్ నారాయణ్ వంటి వారికి మరణానంతరం భారతరత్న ఇచ్చిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications