తిరుపతిలో జలవిలయం: అందుబాటోలోనేనంటూ వర్షాలపై సీఎం జగన్ రివ్యూ, రూ. 1000 తక్షణసాయం
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో మరోమారు సమీక్ష నిర్వహించారు. గురువారం ఉదయం ఒకసారి కలెక్టర్లతో మాట్లాడిన సీఎం, మరోమారు వారితో ఫోన్లో మాట్లాడారు. మొదటిరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు మాట్లాడిన సీఎం, సమావేశం ముగిసిన తర్వాత మరోసారి వారితో వర్షాల పరిస్థితులపై సమీక్షించారు. కురుస్తున్న వర్షాలు, ప్రభావాన్ని అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్లలో, చెరువుల్లో ఎప్పటికప్పుడు నీటిమట్టాలను గమనించుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
Recommended Video

కలెక్టర్లతో సీఎం జగన్ రివ్యూ.. రూ. 1000 తక్షణసాయం
భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలో పరిస్థితులపై చిత్తూరు కలెక్టర్తో సీఎం మాట్లాడారు. అవసరమైన చోట్ల వెంటనే సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీచేశారు. సహాయ శిబిరాల్లో అన్నిరకాల వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయ శిబిరాల్లో ఉన్నవారికి రూ.1,000 రూపాయల చొప్పున తక్షణ సహాయం అందించాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలో సహాయక చర్యలు కోసం సంబంధిత శాఖలన్నీ వెంటనే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైనంత మేరకు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని, వైద్య, ఆరోగ్య సిబ్బంది కూడా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
అందుబాటులో ఉంటానన్న జగన్
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకోసం తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా రాజీపడాల్సిన అవసరంలేదని సీఎం జగన్ స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు వివరాలు అందించాలని, ఏం కావాలన్నా వెంటనే కోరాలని, తాను నిరంతరం అందుబాటులో ఉంటానని సీఎం తెలిపారు. సంబంధిత డిపార్ట్మెంట్లకు చెందిన శాఖాధిపతులు.. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిచ సాయంతో సహాయక చర్యలు చేపట్టాలన్నారు.
చిత్తూరు సహా నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు
కాగా, నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. చెన్నైకి ఆగ్నేయ దిశగా 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ తెలిపింది. వాయుగుండం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతుందని, శుక్రవారం ఉదయానికి చెన్నై-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనిపై ప్రభావంతో ఉత్తర తమిళనాడు, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
తిరుపతిలో వర్షబీభత్సం, జలవిలయం
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో కురిసిన అతి భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేశాయి. తిరుపతి నగరమంతా జలదిగ్భంధంలో చిక్కుకోవడంతో జనసీవనం స్తంభించింది. మధ్యాహ్నం 3గంటల నుంచి తిరుపతిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీనివాస మంగాపురం వద్ద వాహనాలు కొట్టుకుపోతుండటంతో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. దీంతో తిరుపతికి వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు చేరింది. కళ్యాణి జలాశయం పొంగడం, సొమల మండలంలో వాగులు పొంగడంతో 57 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి వాగు ఉధృతికి రెండు స్కూటర్లు, ఆటో కొట్టుకుపోయాయి. ఆటోలోని ప్రయాణికులను స్థానికులు కాపాడారు. వరదనీటిలో చిక్కుకున్న బస్సులోని ప్రయాణికులను కూడా కాపాడారు.
వరదలోనే తిరుపతి
కాగా, భారీ వర్షాలకు తిరుమాడ వీధులు జలమయమయ్యాయి. కనుమదారులు, మెట్ల మార్గంలో భారీగా వరద ప్రవహిస్తుంది. భారీ వర్షంతో రెండో కనుమదారి ప్రమాదకరంగా మారింది. రహదారిపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. హరిణి సమీపంలో రహదారిపై చెట్టు కూలింది. కొండపై నుంచి రహదారిపైకి మట్టి, రాళ్లు కొట్టుకొచ్చాయి. రెండో కనుమదారిలో వాహనాలు నిలిచిపోయాయి. వైకుంఠ క్యూలైన్లలోని సెల్లార్ లోకి కూడా నీరు చేరింది. కపిలతీర్థం పొంగిపొర్లుతోంది. దీంతో తిరుమలలోని భక్తులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఘాట్ రోడ్డులో వరద ప్రవాహంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.
కాగా, చిత్తూరు జిల్లా బలిజపల్లి చెరువు వద్ద కాజ్ వేపై నలుగురు మహిళలు వరదలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారిని జయంతి, కస్తూరి, ఉషారాణి, లక్ష్మీదేవిగా గుర్తించారు. వీరు బంగారుపాళ్యం మండలం టేకుమండ వాసులుగా గుర్తించారు. గల్లంతైనవారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు అధికారులు.












Click it and Unblock the Notifications