నేడు ఢిల్లీకి సీఎం జగన్-అమిత్ షాతో భేటీ-వాటిపై చర్చించే ఛాన్స్-బెయిల్ రద్దు భయమే అంటున్న ప్రత్యర్థులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం(జూన్ 10) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.ఉదయం 10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.40 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్న ఆయన... కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్,జలనవరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ల అపాయింట్మెంట్లు కూడా సీఎం కోరినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉండనున్నారు.రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా... 'బెయిల్ రద్దు' టెన్షనే ఆయన్ను ఢిల్లీకి పరుగులు పెట్టిస్తోందని ప్రత్యర్థులు అభిప్రాయపడుతున్నారు.
ఏయే అంశాలపై చర్చించే ఛాన్స్?
సీఎం జగన్ తాజా ఢిల్లీ పర్యటనలో పోలవరం ప్రాజెక్టు,ఏపీకి రావాల్సిన నిధులు,విభజన హామీలు,వ్యాక్సినేషన్ తదితర అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఎడమ, కుడి కాలువల పనులు, భూసేకరణ పెండింగ్లోనే ఉన్నాయి. మరోవైపు కేంద్రం వీటికి నిధులు ఇవ్వబోమని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పోలవరం నిధులపై సీఎం జగన్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి కేంద్రం సాయాన్ని సీఎం కోరనున్నట్లు తెలుస్తోంది.
బెయిల్ రద్దు టెన్షన్..? ప్రత్యర్థుల వాదన..
రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు చర్చించేందుకే సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ 'బెయిల్ రద్దు' అంశం ఆయన్ను టెన్షన్ పెడుతోందని... అందుకే ఢిల్లీ వెళ్తున్నారని ప్రత్యర్థులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు నాంపల్లి కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీన అది విచారణకు రానుంది. ఇంతలోనే సీఎం జగన్ బెయిల్ రద్దు కాబోతుందని వైసీపీ వ్యతిరేక వర్గాలు ఊహాగానాలు మొదలుపెట్టాయి. అంతేకాదు,బెయిల్ రద్దయ్యే పక్షంలో తన సతీమణి భారతిని సీఎం సీటులో కూర్చోబెట్టే యోచనలో జగన్ ఉన్నారని ప్రచారం చేస్తున్నారు.
రఘురామ రచ్చకు బ్రేక్ వేసేందుకేనా?
రాజద్రోహం కేసులో అరెస్టయి,ప్రస్తుతం బెయిల్పై ఉన్న ఎంపీ రఘురామ కృష్ణరాజు ఢిల్లీలో మకాం వేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఒక ఎంపీ అయిన తనపై ప్రభుత్వం థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని.. అసత్య ఆరోపణలతో రాజద్రోహం కేసు నమోదు చేసిందని కేంద్రమంత్రులను కలిసి వివరిస్తున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు అమిత్ షా,రాజ్నాథ్ సింగ్,లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలకు సీఎం జగన్పై ఆయన ఫిర్యాదు చేశారు. అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు,గవర్నర్లకు సైతం దీనిపై లేఖలు రాశారు. అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగట్టుకునేందుకు ఆయన తన శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రఘురామ రాజు చేస్తున్న రచ్చకు బ్రేక్ వేసేందుకే జగన్ హస్తినకు పయనమయ్యారన్న చర్చ కూడా జరుగుతోంది. కేంద్రమంత్రులకు ప్రభుత్వ వెర్షన్ కూడా వినిపించాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంతో జగన్ ఎలా వ్యవహరించబోతున్నారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.