వైఎస్ జగన్ జెట్ స్పీడ్: కార్యకర్తలతో భేటీకి సమాంతరంగా..ప్రజలతో: కొత్త ప్రోగ్రామ్ ఇదే
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రూటు మార్చారు. ఈ మధ్యకాలంలో ఆయన తరచూ పార్టీ నాయకులతో సమావేశమౌతోన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల వరుస భేటీలను నిర్వహిస్తోన్నారు. 175 అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ఉన్నారు. దీనికోసం పార్టీ క్యాడర్తో వరుస సమావేశాలను నిర్వహిస్తోన్నారు. ఇటీవలే ఎమ్మెల్యేలను కలుసుకొన్నారు. ఇప్పుడు తాజాగా పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు.
ఇక ప్రజలతో మమేకం..
రాజకీయ సమావేశాలు, పార్టీ నేతలతో భేటీలకు సమాంతరంగా మరో కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు వైఎస్ జగన్. దీనికి ముహూర్తం కూడా ఖాయమైంది. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి, ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టబోతోన్నారు. ప్రజాదర్బార్ను సైతం ప్రజల బాగోగులను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి దీన్ని నిర్వహించనున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ ప్రతిరోజూ ఉదయం పూట తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ను నిర్వహించే వారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, విజ్ఞప్తులను అప్పటికప్పుడు పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. వైఎస్సార్ స్వయంగా ప్రజలను కలుసుకునే వారు. వైఎస్సార్కు ఇప్పటికీ ఈ స్థాయిలో జనాదరణ ఉండటానికి ప్రజాదర్బార్ కూడా ఓ కారణం అనే అభిప్రాయాలు లేకపోలేదు.
అదే తరహాలో..
ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అదే తరహాలో.. ప్రజాదర్బార్ను నిర్వహించనున్నారు. ప్రజలను నేరుగా కలుసుకోనున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారించడానికి ప్రత్యేకంగా అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. తన కార్యాలయంలో ఓ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోన్నారు. ప్రతి రోజూ ఉదయం దీన్ని నిర్వహించేలా షెడ్యూల్ను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన 50 మంది కార్యకలతో భేటీ, ప్రజా దర్బార్తో జెట్ స్పీడ్ను అందుకున్నట్టయింది.
ఇదివరకే చేపట్టాల్సి ఉన్నా..
ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఇదివరకే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. వాయిదా పడింది. దీన్ని నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తికాకపోవడం, భారీ వర్షాలు సంభవించడం, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణపై ముఖ్యమంత్రి దృష్టి సారించాల్సి రావడం, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం వర్క్షాప్లను నిర్వహించడం వంటి పరిణామాల వల్ల దీన్ని ప్రారంభించడంలో జాప్యం ఏర్పడింది. ఇక తాజాగా దీన్ని ఆగస్టు 4వ తేదీ నుంచి లాంఛనంగా చేపట్టనున్నారు.
వారంలో అయిదు రోజుల పాటు..
ప్రజా దర్బార్ కోసం వారంలో అయిదు రోజులను కేటాయించనున్నారు. ఉదయం పూట రెండు గంటల పాటు దీన్ని నిర్వహించేలా షెడ్యూల్ను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. తన వద్దకు వచ్చిన ప్రతీ అంశాన్ని పాలనా పరంగా - రాజకీయంగా పరిష్కరించేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటారు. నియోజకవర్గాలవారీగా దీన్ని విభజించి, గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమంలో అందిన ఫిర్యాదులతో పాటు ప్రజాదర్బార్లో అందిన విజ్ఞప్తులను కూడా పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారు.