జగన్ సర్కార్ ఫీజు చెల్లించదు-కాలేజీ సర్టిఫికెట్ ఇవ్వదు-నలిగిపోతున్న విద్యార్ధులు
ఏపీలో విద్యార్ధులకు కాలేజీ ఫీజుల చెల్లింపు కోసం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జగనన్న విద్యా దీవెన పథకానికి బ్రేకులు తప్పడం లేదు. విద్యార్ధులకు చెల్లించాల్సిన ట్యూషన్ ఫీజుల్ని ప్రభుత్వం కాలేజీల ఖాతాల్లో కాకుండా తల్లుల ఖాతాల్లో వేస్తుండటంతో వారు తిరిగి కాలేజీలకు వాటిని చెల్లించడం లేదు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకుని బ్రేకులు వేసింది. అదే సమయంలో ప్రభుత్వం కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కూడా చెల్లించకపోవడంతో విద్యార్ధులు సర్టిఫికెట్లు లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది.
ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్
ఏపీవో విద్యార్ధులకు వారు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజుల్ని రీయింబర్స్ మెంట్ పేరుతో తిరిగి చెల్లించే పధకం గతంలో మాజీ సీఎం వైఎస్సార్ హయాంలోనే ప్రారంభమైంది. అప్పట్లో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంతో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దీన్ని కొనసాగించక తప్పని పరిస్ధితి ఎదురైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ వివిధ రూపాల్లో పేర్లు మార్చుకుంటూ కొనసాగుతున్న ఈ పథకానికి వైసీపీ సర్కార్ జగనన్న విద్యా దీవెనగా అమలు చేస్తోంది. దీంతో ప్రభుత్వం ఏటా కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజుల్ని కాస్తా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా వేస్తోంది. దీంతో విద్యార్ధులకు ఆ మేరకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.
విద్యాదీవెనకు హైకోర్టు బ్రేక్
జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా కాలేజీలకు బదులుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్ మెంట్ మొత్తాల్ని జమ చేస్తుండటంతో అవి కాస్తా తిరిగి కాలేజీలకు చేరడం లేదు. దీంతో కాలేజీలు కోర్టుకెక్కాయి. కేసు విచారించిన హైకోర్టు.. విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో వేయడమేంటని వైసీపీ సర్కార్ ను ప్రశ్నించింది. ఇలా తల్లుల ఖాతాల్లో వేసిన 40 శాతం ఫీజులు కాలేజీలకు చేరని విషయాన్ని గుర్తు చేసింది. దీంతో విద్యాదీవెన పథకం ఉద్దేశం నెరవేరడం లేదని తెలిపింది. ప్రయోజనం నెరవేరనప్పుడు తల్లుల ఖాతాల్లో ఫీజులు వేయకుండా అడ్డుకట్ట వేసింది. దీంతో ఇకపై నేరుగా కాలేజీల ఖాతాల్లోనే ఫీజులు వేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ ఇరుకునపడింది. దీనిపై అప్పీలుకు వెళ్తామని చెప్తున్నా ఇంత వరకూ ఆ దిశగా అడుగులు పడుతున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఇంకా అప్పీలుకు వెళ్లని జగన్ సర్కార్
జగనన్న విద్యాదీవెన పథకంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం అప్పీలుకు వెళ్తుందని అంతా భావించారు. కానీ ఇప్పటివరకూ ప్రభుత్వం మాత్రం ఈ ఆదేశాలను సవాల్ చేయలేదు. దీంతో విద్యాదీవెన పథకంలో భాగంగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో డబ్పుులు జమ చేసేందుకు వీల్లేకుండా పోయింది. అలాగని కాలేజీల ఖాతాల్లో అయినా ప్రభుత్వం ఈ ఫీజుల్ని జమ చేస్తుందా అంటే అదీ లేదు. దీంతో కాలేజీలు విద్యార్ధులకు చుక్కలు చూపించడం మొదలుపెట్టాయి. కాలేజీలకు ఎంట్రీ దగ్గరి నుంచి సర్టిఫికెట్ల వరకూ అన్ని విషయాల్లో విద్యార్ధుల్ని ఇబ్బందిపెడుతున్నాయి.
అయినా ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్లడం లేదు.
వెయ్యికోట్లు దాటిన పాత బకాయిలు
ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంలో భాగంగా గతంలో చెల్లించాల్సిన మొత్తాలే ఇంకాచెల్లించకపోవడంతో పరిస్ధితి మరింత దారుణంగా మారుతోంది. గత విద్యాసంవత్సరానికి చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్ని ప్రభుత్వం ఇప్పటివరకూ పూర్తిగా చెల్లించలేదు. విద్యాసంవత్సరం పూర్తయినా ఇంకా పూర్తి ఫీజు చెల్లించలేదు. అలాగే ఇంజనీరింగ్ రెండు, మూడు, నాలుగు సంవత్సరాల్లోకి ప్రవేశించిన వారికి ఈ ఏడాది ఫీజులు కూడా పూర్తిగా చెల్లించలేదు. గత విద్యాసంవత్సరానికి సంబంధించి రెండు వాయిదాల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో వేసినా హైకోర్టు ఉత్తర్వులతో వీటికీ బ్రేక్ పడింది. దీంతో పాత బకాయిలతో పాటు కొత్త బకాయిలు కలుపుకుంటే వెయ్యికోట్లు దాటిపోయింది. అలాగే 2018-19 విద్యాసంవత్సరానికి సంబంధించి మరో రూ.250 కోట్ల బకాయిలు కూడా ఉన్నాయి.
సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలు
గత విద్యాసంవత్సరంలో విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీలు పరీక్షలు రాసి పాసైన విద్యార్ధులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. విద్యార్ధుల ఫీజుల్ని తల్లుల ఖాతాల్లో వేస్తున్నందున అవి తిరిగి తమకు చేరవని భావిస్తున్న కాలేజీలు విద్యార్ధులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత విద్యా కమిషన్ తో పాటు ఉన్నత విద్య నియంత్రణ, ఫీజుల పర్యవేక్షణ కమిషన్ ను ఆశ్రయిస్తున్నారు. అయినా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో అక్కడా వారికి నిరాశే ఎదురవుతోంది. దీంతో ఏం చేయాలో తెలియక విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
నలిగిపోతున్న విద్యార్ధులు
విద్యార్ధులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజులు చెల్లించకపోవడం, హైకోర్టు కాలేజీలకు బదులుగా తల్లుల ఖాతాల్లో ఫీజులు వేయకుండా నియంత్రించడంతో అటు కాలేజీలు, ఇటు ప్రభుత్వం మధ్య విద్యార్ధులు నలిగిపోతున్నారు. అటు ప్రభుత్వాన్ని ఆశ్రయించలేక, ఇటు కాలేజీలకు నచ్చజెప్పుకోలేక విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో కొందరు చేసేది లేక కాలేజీలకు సొంతగా ఫీజులు కట్టుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నమ్ముకుని ఫీజులు వస్తాయని ఇంతకాలం ఎదురుచూసిన విద్యార్ధులు ఇప్పుడు ఫీజులు రాక సొంతంగా ఫీజులు కట్టుకోవాల్సిన దుస్దితి రావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్ధులు ఇంత ఇబ్బంది ఎదుర్కొంటున్నా వైసీపీ ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. త్వరలో అప్పీలు దాఖలు చేస్తామని చెబుతున్నా అదెంత వరకూ ఫలిస్తుందో తెలియని పరిస్ధితి.