ఏపీలో కాంగ్రెస్ నేతల మహా ర్యాలీ: మెడీ-జగన్-ఈడీ ప్రమాదకర జోడీ
విజయవాడ: ఏపీ కాంగ్రెస్ నాయకులు విజయవాడలో నిర్వహించిన మహా ర్యాలీ.. అరెస్టులతో ముగిసింది. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు, నిరోద్యోగం పెరగడం, కేంద్ర ప్రభుత్వం ఆహార వస్తువలను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడం వంటి చర్యలను నిరసిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఉదయం ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు విజయవాడలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి రాజ్భవన్ వరకు దీన్ని చేపట్టారు.
పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టన్ ఎన్ తులసీ రెడ్డి, పలువురు నాయకులు దీనికి హాజరయ్యారు. కూరగాయలను మెడలో ధరించి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఆహార వస్తువులను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలంటూ నినదించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమత్ షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడారు. దేశంలో నరేంద్ర మోడీ నియంతృత్వ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. ఆహార వస్తువులపై జీఎస్టీ విధించడం వల్ల వాటి రేట్లు విపరీతంగా పెరిగాయని ధ్వజమెత్తారు. అడ్డూ అదుపు లేకుండా నిత్యావసర సరుకుల ధరలు పెరగడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలే కారణమని విమర్శించారు. జీఎస్టీ పెంపు వల్ల నిరుపేదలపై ఎలాంటి భారం పడబోదంటూ నిర్మల సీతారామన్ చెప్పడాన్ని తప్పు పట్టారు.
ఏకపక్ష విధానాలకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒంటెత్తు పోకడలు పోతున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని చెప్పారు. తమ విధానాలను విమర్శించిన వారిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపు పన్ను వంటి శాఖలను ప్రయోగించి.. భయోత్పాతాన్ని సృష్టిస్తోందని మండిపడ్డారు. దేశంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేసేలా కుట్ర పన్నిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ పార్టీ భయపడబోదని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని, నిరుద్యోగం భారీగా పెరిగిందని, అయినప్పటికీ.. దాని గురించి పట్టించుకోకుండా ప్రతిపక్షాలను అణచివేయాలనే ఏకైక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన ప్రధాని మోడీ పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా వ్యవహరిస్తోన్నారని, కేసులకు భయపడుతున్నారని విమర్శించారు.