ఏపీలో కరోనా ఉధృతి : గత 24 గంటల్లో 3,263 కొత్త కేసులు ,11 మరణాలు, జిల్లాల వారీగా కేసులివే !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ దేశంలో దారుణమైన పరిస్థితులు సృష్టిస్తున్న సమయంలో ఏపీలోనూ కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 33,755 నమూనాలను పరీక్షించగా 3,263 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది.
ఏపీలో కరోనా పాజిటివ్ వచ్చినా పకోడీలు వేసి వస్తానన్న బాధితుడు ... వైద్య సిబ్బంది షాక్ !!
గత 24 గంటల్లో 3,263 కొత్త కేసులు , మొత్తం కేసులు 9,28,664
చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. చిత్తూరు జిల్లాలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి . గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 654 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో ఇప్పటి వరకు కొత్తగా నమోదైన కరోనా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,28,664 కు చేరుకుంది. వీరిలో మొత్తం 8,98,238 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో 1,091 మంది కరోనా నుండి పూర్తిగా కోలుకున్నారు.
గత 24 గంటల్లో కరోనా కారణంగా 11 మంది మృత్యువాత
గత 24 గంటల్లో కరోనా కారణంగా 11 మంది మృత్యువాత పడ్డారు. ఇక తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,113కి చేరింది. ఇక కరోనా నుంచి మృతిచెందిన వారి వివరాలు చూస్తే గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నం ,కర్నూలు ,కడప అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు . ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో 23,115 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 654 కేసులు
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,54,63,146 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలను చేశారు.
ఇక జిల్లాల వారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులను చూస్తే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 654 కేసులు నమోదు కాగా ఆ తర్వాతి స్థానంలో విశాఖపట్నం 454 కేసులతో నిలిచింది. ఇక గుంటూరులో 418 కేసులు, కృష్ణాజిల్లాలో 318 కేసులు, శ్రీకాకుళంలో 280 కేసులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 259 కేసులు, నెల్లూరు జిల్లాలో 245 కేసులు నమోదయ్యాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 19 కేసులు
కర్నూలు జిల్లాలో 176 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 134 కేసులు, అనంతపురం జిల్లాలో 116 కేసులు, ప్రకాశం జిల్లాలో 107 కేసులు ,విజయనగరం జిల్లాలో 83 కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 19 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, విశాఖపట్నం ,గుంటూరు, కృష్ణ జిల్లాలో కేసులు పెరుగుతున్న తీరు ఆయా జిల్లాల వాసులకు ఆందోళన కలిగిస్తుంది. మొత్తానికి రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ఏపీలో భయాందోళనలు నెలకొన్నాయి.