ఏపీలో కరోనా కల్లోలం .. నిన్న మూడు వేలకు పైగా కొత్తకేసులు , 12 మరణాలు, ఆ జిల్లాల్లోనే అధికం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ప్రజల్లో ఆందోళన కు కారణమవుతున్నాయి. ఏపీ లో గత 24 గంటల్లో 3,309 కరోనా కొత్త కేసులు నమోదు కావడం ప్రజల్లో భయాందోళనకు కారణంగా మారింది. ఇక మరణాలు సైతం పెరుగుతున్నాయి .

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3309 కరోనా కేసులు నిర్ధారణ
ఒక్క రోజు వ్యవధిలో 31,929 నమూనాలను పరీక్షించిన అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 3309 కరోనా కేసులు నిర్ధారణ అయినట్లుగా వెల్లడించారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఇక తాజాగా నమోదైన కొత్త కేసుల తో కలిపి రాష్ట్రంలో మొత్తం 9,21,906 కరోనా కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా 12 మంది మృతి చెందారని పేర్కొన్నారు.

12 మంది మరణాలతో , రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 7,291
చిత్తూరులో ముగ్గురు ,నెల్లూరు, విశాఖ శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు చొప్పున కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు . ఇక గుంటూరు కృష్ణా అనంతపురం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు . గత 24 గంటల్లో నమోదైన 12 మంది మరణాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 7,291కి చేరుకుంది.
గత 24 గంటల్లో కరోనా నుండి 1,053 మంది పూర్తిగా కోలుకోగా ప్రస్తుతం 18, 666 కరోనా యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి.

చిత్తూరు జిల్లాలో కరోనా పంజా .. గత 24 గంటల్లో 740 భారీ కేసులు
ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,53, 97,672 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులిటెన్ లో వెల్లడించింది . రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నమోదైన కరోనా కేసులు చూస్తే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 740 కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యల్పంగా 26 కరోనా కేసులు నమోదయ్యాయి . చిత్తూరు జిల్లాలో 740 కరోనా కేసులు, గుంటూరు జిల్లాలో 527 కరోనా కేసులు ,విశాఖపట్నంలో 391 కరోనా కేసులు నమోదయ్యాయి.

అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కేసులు
కర్నూలు జిల్లాలో 296 కరోనా కేసులు ,శ్రీకాకుళం జిల్లాలో 279 కరోనా కేసులు కృష్ణాజిల్లాలో 278 కేసులు గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. ప్రకాశం జిల్లాలో 174 , అనంతపూర్, నెల్లూరులో 133 కరోనా కేసులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 124 కరోనా కేసులు , తూర్పుగోదావరిలో 111 కేసులు, ఇక విజయనగరంలో 97 కేసులు, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో
26 కరోనా కేసులు నమోదయ్యాయి .












Click it and Unblock the Notifications