ఏపీలో జూన్ 20 వరకు పొడిగింపు: మరో రెండు గంటలపాటు సడలింపులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూను మరో పది రోజులు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే, కరోనా కేసులు రాష్ట్రంలో క్రమంగా తగ్గుముఖం పట్టడంతో మరో రెండు గంటలపాటు సడలింపులను కూడా పెంచింది ప్రభుత్వం. ఈ సండలింపులు రేపట్నుంచి అమలు కానున్నాయి. ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి 12 వరకే వెసులుబాటు ఉన్న విషయం తెలిసిందే.
జూన్ 20 వరకు ఉదయం 6 నుంచి 2 గంటల వరకు సడలింపులు
జూన్ 11 నుంచి రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ నుంచి వెసులుబాటు కల్పించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆ తర్వాత ఉదయం 6 గంటల వరకు కఠినంగా కర్ఫ్యూను అమలు చేయనున్నారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ వేళల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో సర్కారు స్పష్టం చేసింది. నేటి నుంచి మరో పది రోజులపాటు అంటే జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఏపీలో తగ్గుతున్న కరోనా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 93,511 నమూనాలను పరీక్షించగా.. 8766 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది. తాజాగా నమోదైన 8766 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,79,773కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 67 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 11,696కు చేరింది.
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 12,292 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 16,64,082కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 1,03,995 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,00,39,764 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1980 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరంలో 265 మంది కరోనా బారినపడ్డారు.
పిల్లల తల్లులకు కరోనా వ్యాక్సిన్..
శ్రీకాకుళం జిల్లాలో గురువారం ఐదేళ్లలోపు బిడ్డలున్న తల్లులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగునుంది. విదేశాల్లో చదువు, ఉద్యోగం నిమిత్తం వెళ్లేవారికి కూడా కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ అందించనున్నారు.
సంబంధిత పత్రాలు చూపించిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. విదేశాలకు వెళ్లేవారికి శ్రీకాకుళం నగరప రిధిలోని దమ్మలవీధి పట్టణ ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇక నెల్లూరు జిల్లాలోనూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆశా వర్కర్లు పిల్లల తల్లులకు వ్యాక్సిన్ సమాచారం అందిస్తున్నారు.