అమరావతి రాజధానిపై సీఆర్డీయే భేటీ-చంద్రబాబు కీలక నిర్ణయాలు..!
అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఇవాళ సమావేశమైన సీఆర్డీయే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీయే 47వ భేటీలో రాజధానిలో భూముల కోసం వచ్చిన ప్రతిపాదనలపై చర్చించడంతో పాటు కేటాయింపులకు ఆమోద ముద్ర వేశారు. అలాగే రాజధానిని జాతీయ రహదారితో అనుసంధానం చేసేందుకు వీలుగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
ఇవాళ జరిగిన సీఆర్డీఏ భేటీలో మొత్తం 10 అంశాలపై సీఎం చంద్రబాబు, మున్సిపల్ మంత్రి నారాయణ, ఇతర అధికారులు చర్చించారు. అనంతరం ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ వెల్లడించారు. ఇందులో గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల పూర్తికి రూ.514.41 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అధారిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఆయా భవనాల వద్ద అదనపు మౌలిక సదుపాయాలు కల్పన కోసం రూ.194 కోట్లకు సీఆర్డీఏ అథారిటీ అనుమతి ఇచ్చిందన్నారు.

9 టవర్ ల నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు, మౌలిక సదుపాయాలకు కూడా సీఆర్డీఏ అనుమతి మంజూరు చేసింది. రూ.517 కోట్లతో టెండర్లకు అనుమతి ఇచ్చారు. మొత్తంగా రూ.1732.31 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపారు. 190 ఎంఎల్దీల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.568.57 కోట్ల తో టెండర్ పిలిచేందుకు కూడా సీఆర్డీఏ అనుమతిచ్చింది. 15 ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు.
అలాగే అమరావతిలో 3.5 కిలోమీటర్ల ఈ3 రోడ్డును ఎలివేటెడ్ రోడ్డుగా చేసేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే ఈ15, ఈ13 రోడ్లను జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా అనుమతి ఇచ్చారు. అటు లా యూనివర్సిటీ కి 55 ఎకరాలు,క్వాంటం వ్యాలీకి 50 ఎకరాలు, బసవ తారకం ఆస్పత్రికి అదనంగా మెడికల్ కాలేజీ కి మరో 6 ఎకరాలు కేటాయించారు. గతంలో ఈ సంస్థకు 15 ఎకరాలు కేటాయించారు.
మరోవైపు అమరావతిలో ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి 0.78 ఎకరాలు,రెడ్ క్రాస్ సొసైటీ కి 0.78ఎకరాలు,కోస్టల్ బ్యాంకు కు 0.40 ఎకరాలు, ఐఅర్సీటీసికి ఎకరా భూమి కేటాయించారు. గతంలో 64 సంస్థలకు ఇక్కడ భూ కేటాయింపులు జరిగాయి. ఇప్పటి వరకూ 1050 ఎకరాల మేర భూ కేటాయింపులు రాజధాని ప్రాంతంలో జరిగాయని మంత్రి నారాయణ వెల్లడించారు.












Click it and Unblock the Notifications