'కేసీఆర్ అధికార దుర్వినియోగం', 'ఏపీ ప్రజలు కసితో ఉన్నారు'
అమరావతి: కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబును కావాలనే కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాజధానిలో సెక్షన్ 8 అమలు కావడం లేదని తెలిపారు. ఒక రాష్ట్ర విషయంలో మరోక రాష్ట్రం జోక్యం చేసుకోవడం ఎంత మాత్రం సరికాదని తెలిపారు.
ఏపీ ప్రజలు కసితో ఉన్నారు: మురళీ మోహన్
ఏపీ ప్రజలు కసితో ఉన్నారని రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ అన్నారు. శుక్రవారం అనకాపల్లిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అంశంపై తీవ్రంగా స్పందించారు. విభజన కారణంగా ప్రజలు ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీకి పూర్వవైభవం తీసుకొస్తామని, దానిని సాధించేందుకు ప్రజలు ఎంతో కసితో ఉన్నారని తెలిపారు. ఇష్టం వచ్చినట్లు రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
భూసమీకరణ చాలా సున్నితమైన అంశం: మంత్రి నారాయణ
భూసమీకరణ అంశం చాలా సున్నితమైన అంశమని మంత్రి నారాయణ అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడాలో మీడియాతో మాట్లాడారు. రోజుకు 400 ఎకరాల చొప్పున భూ సమీకరణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్టోబరులో రాజధాని శంకుస్ధాపన ఉంటుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో జాతీయస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు, విశాఖపట్నంలోని సబ్బవరంలో స్పోర్ట్స్ స్కూల్, కొమ్మాదిలో స్పోర్ట్స్ విలేజ్, గుంటూరులోని కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఆధునీకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.