ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా టిడిపి కోలుకోవటం అసాధ్యం: తేల్చి చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దా
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రైతాంగానికి మంచి చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన జలయజ్ఞాన్ని నిర్వీర్యం చేసిన పాపం చంద్రబాబు నాయుడిదే అని ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. జగన్ రాష్ట్రాన్ని సస్య శ్యామలం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతున్నారని, ఇతర పార్టీలతో పొత్తుల వ్యవహారం నడుపుతున్నారనిఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇంతకంటే సిగ్గుచేటు వ్యవహారం మరొకటి ఉండదని ధర్మాన కృష్ణదాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు.. జగన్ కు ఎన్నికల కమీషన్ కు సంబంధం ఏమిటో చెప్పాలి: ఎమ్మెల్యే రోజా రివర్స్ ఎటాక్
అభివృద్ధి చూసి ఒర్చుకోలేకే చంద్రబాబు ఆరోపణలు
ప్రజలకు జవాబుదారీగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు ధర్మాన కృష్ణ దాస్. అభివృద్ధి, సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించిన ధర్మాన కృష్ణదాస్ నేడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి పాలవుతామని తెలిసే చంద్రబాబు వైసీపీపై ఆరోపణలకు శ్రీకారం చుట్టారని విమర్శించారు .
జనసేన, బీజేపీల సహాయం చంద్రబాబు అర్ధిస్తున్నారు
ఇప్పుడు రైతుల కోసం పోరాటం చేస్తున్నామని చెప్తున్న చంద్రబాబు, గతంలో టీడీపీ హయాంలో రైతుల సమస్యలపై దృష్టి పెట్టలేదని, రైతుల సమస్యలు పట్టించుకోలేదని ధర్మాన కృష్ణ దాస్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసం జనసేన, బీజేపీ ల సహాయాన్ని చంద్రబాబు అర్ధిస్తున్నారు అని ధర్మాన కృష్ణదాస్ ఎద్దేవా చేశారు. బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేన, బీజేపీకి బహిరంగంగా మద్దతు ఇస్తే తెలుగుదేశం పార్టీ బీజేపీకి రహస్యంగా మద్దతు ఇచ్చిందని ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని చేసినా, ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా రాష్ట్రంలో టిడిపి కోలుకోవటం సాధ్యం కాదని ధర్మాన కృష్ణదాస్ తేల్చి చెప్పారు.
చంద్రబాబు విమర్శలను జగన్ అసలే పట్టించుకోడు
అంతేకాదు వంశధార నదిపై నేరడి బ్యారేజి నిర్మించే విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒడిశా వెళ్తారని పేర్కొన్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో జరిపే చర్చలతో బ్యారేజీ నిర్మాణానికి ఉన్న ఆటంకాలు త్వరలో తొలగిపోతాయని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించింది అని తెలిపిన ఆయన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలను సీఎం జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోరని తనదైన పాలన సాగిస్తున్నారని ధర్మాన కృష్ణదాస్ తేల్చిచెప్పారు.