ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా ? హింట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం...
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే పార్లమెంటరీ నియోజకవర్గాలను జిల్లాలుగా మారుస్తామని చెప్పింది. దీనికి అనుగుణంగానే గత ఏడాది వైసీపీ సర్కార్ రాష్ట్రంలోని 25 ఎంపీ నియోజకవర్గాలను ఒక్కో ప్రత్యేక జిల్లాగా మార్చింది. దీంతో పాటు అరకు పార్లమెంటు సీటును రెండు జిల్లాలుగా విభజించింది. దీంతో జిల్లాల విభజన పూర్తయింది. కానీ ఇప్పుడు మరో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర హింట్ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయినా పాలనా సౌలభ్యం కోసం మరో కొత్త జిల్లా ఏర్పాటుచేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పాలనకు అనువుగా మరో జిల్లా ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు.

ఇప్పటికే అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రభుత్వం రెండు జిల్లాలు ఏర్పాటుచేసిందని, ఇప్పుడు ఇందులోనే మరో జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు డిప్యూటీ సీఎం రాజన్న దొర తెలిపారు. దీంతో అరకు ఎంపీ సీటునే మరో జిల్లాగా విభజించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం తెరవెనుక కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలవరం పరిధిలోకి వచ్చే గ్రామాలతో పాటు మరికొన్ని ప్రాంతాలను కలుపుతూ ఈ కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వాస్తవానికి గతంలో కొత్త జిల్లా ఏర్పాటు సమయంలోనే ఈ 27వ జిల్లాపై కసరత్తు చేశారు. ఈ జిల్లా కూడా ప్రకటిస్తారనే భావించారు. కానీ స్ధానిక సమస్యలు, దీనిపై కసరత్తు చేసేందుకు అధికారులు కూడా బిజీగా ఉండటంతో ఈ ప్రతిపాదన తాత్కాలికంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మరోసారి ఎన్నికలకు ముందు ఈ కొత్త జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications